పాక్‌కు గూఢచర్యం కేసులో యూట్యూబర్ జ్యోతి అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. పహల్గాం దాడికి ముందు ఆమె అక్కడ పర్యటించినట్లు తెలుస్తుంది.అంతేకాకుండా హైదరాబాద్‌లోనూ జ్యోతి ఆనవాళ్లను అధికారులు గుర్తించారు.

‘ట్రావెల్ విత్ జో..

పాకిస్థాన్‌కు భారత రహస్య సమాచారం చేరవేస్తుందనే ఆరోపణలతో ఇటీవల అరెస్టయిన హరియాణా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసు ఇన్వేస్టిగేషన్ లో  షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాను ‘ట్రావెల్ విత్ జో’ అనే యూట్యూబ్ ఛానెల్ నడుపుతున్న జ్యోతి, గతేడాది పాకిస్థాన్‌ను సందర్శించిన సమయంలో అక్కడి హైకమిషన్‌లో పనిచేసే డానిష్ అనే అధికారితో పరిచయం ఏర్పరచుకుంది. అదే పరిచయం తర్వాత గూఢచార్యానికి దారితీసినట్లు అనుమానిస్తున్నారు.

ఉగ్రదాడికి మూడు నెలల ముందు..

వివరాల్లోకి వెళితే, కశ్మీర్‌లోని పహల్గాంలో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడికి మూడు నెలల ముందు జ్యోతి అక్కడికి వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. పర్యాటక ప్రాంతం అన్న నెపంతో వీడియోలు తీసిన ఆమె, ఆ దృశ్యాలను పాక్‌కి పంపినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. దర్యాప్తులో ఆమె డానిష్ సూచనలతో పాక్‌కి చెందిన అలీ అహ్సాన్ అనే మరో వ్యక్తిని కలిసినట్టు తెలిసింది. ఇతను ఆమెను పాకిస్థాన్ నిఘా సంస్థలకు పరిచయం చేసినట్లు సమాచారం.

చైనా కూడా..

ఇప్పటికే భారత్‌కు చెందిన అత్యంత సున్నితమైన రక్షణ సమాచారాన్ని జ్యోతి పాక్ ఏజెంట్లకు అందించిందని అధికారులు ఆరోపిస్తున్నారు. గూఢచార్యం ఆరోపణలపై హరియాణాలో ఆమెను అరెస్టు చేసిన పోలీసులు, దేశవ్యాప్తంగా ఆమె వెళ్లిన ప్రదేశాలపై దర్యాప్తు చేస్తున్నారు. చైనా కూడా ఆమె ప్రయాణాల్లో ఒకటిగా ఉండటంతో ఆ దేశంలో జరిగిన కార్యకలాపాలపై కూడా విచారణ సాగుతోంది.

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో..

ఇక జ్యోతిని గురించి మరో ఆసక్తికరమైన విషయం బయటపడింది. 2023 సెప్టెంబరులో ప్రధాని మోదీ హైదరాబాద్-బెంగళూరు వందేభారత్ రైలు ప్రారంభించిన రోజున ఆమె సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో కనిపించింది. అప్పటి గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఆమె యూట్యూబర్‌గా వీడియోలు తీసినట్టు ఫుటేజ్‌లు వైరల్ అవుతున్నాయి. ఆమె హైదరాబాద్‌కు ఎందుకు వచ్చిందో, అక్కడ ఎవ్వరినైనా కలిశారా అన్న కోణంలో నిఘా సంస్థలు విచారిస్తున్నాయి.

ఈ కేసు దేశవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. యూట్యూబర్‌గా కనిపించిన ఓ మహిళ విదేశీ గూఢచారిగా మారడం, రక్షణ వ్యవస్థపై ప్రమాదం తెచ్చిపెట్టిన విషయాలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. పోలీసులు ఇప్పుడు ఆమె గత టూర్‌లను, కలిసిన వ్యక్తులను, తీసిన వీడియోలను సమగ్రంగా విశ్లేషిస్తున్నారు.