హిజాబ్ వివాదం.. గంగా-జమునా పాఠశాల గుర్తింపును రద్దు చేసిన మధ్యప్రదేశ్ ప్రభుత్వం
మధ్యప్రదేశ్ లోని దామోహ్ జిల్లాలో ఉన్న గంగా జమునా పాఠశాలలో ఇటీవల హిజాబ్ వివాదం తలెత్తింది. ఈ నేపథ్యంలో ఆ పాఠశాలను అధికారులు తనిఖీ చేశారు. అక్కడ విద్యార్థులకు కనీస సౌకర్యాలు కల్పించడం లేదంటూ అధికారులు నివేదిక ఇచ్చారు. దీంతో ఆ పాఠశాల గుర్తింపును ప్రభుత్వం రద్దు చేసింది.
రెండు రోజుల క్రితం హిజాబ్ వివాదం చెలరేగిన దామోహ్ లోని గంగా జమునా హయ్యర్ సెకండరీ స్కూల్ రిజిస్ట్రేషన్ ను మధ్యప్రదేశ్ ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. పాఠశాలను తనిఖీ చేసిన బృందం కనుగొన్న అంశాల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ తన నోటిఫికేషన్ లో పేర్కొంది.
రైల్వే మంత్రి రాజీనామా చేయాలని తృణమూల్ డిమాండ్.. దిమ్మతిరిగే కౌంటరిచ్చిన బీజేపీ..
తనిఖీల్లో పాఠశాలలో తాగునీరు, బాలికలకు బాత్రూంలు సహా పలు లోపాలు కనిపించాయని పేర్కొంది. దామోహ్ లోని గంగా జమునా పాఠశాల రాష్ట్ర విద్యాశాఖ నిర్దేశించిన నిబంధనలను పాటించడం లేదని తేలిందని, అందువల్ల తక్షణమే దాని రిజిస్ట్రేషన్ గుర్తింపును రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నామని ఆ నోటిఫికేషన్ తెలిపింది.
'ప్రజాస్వామ్యంతోనా..ప్రధాని మోడీతోనా.. అనేది కాంగ్రెస్ తేల్చుకోవాలి' : కేజ్రీవాల్
అసలేం జరిగిందంటే ?
బోర్డు ఎగ్జామ్ టాపర్లను అభినందిస్తూ ఓ పోస్టర్ ను ఆ పాఠశాల గోడకు మంగళవారం అతికించడంతో వివాదం మొదలైంది. ఆ చిత్రాల్లో కనిపిస్తున్నట్టుగా ముస్లిమేతర విద్యార్థినులను బలవంతంగా హిజాబ్ ధరించాలని ఒత్తిడికి గురి చేస్తున్నారని వీహెచ్ పీ, ఏబీవీపీ సహా పలు మితవాద సంస్థలు ఆరోపించారు. మహమ్మద్ ఇక్బాల్ రాసిన శ్లోకాలను విద్యార్థులతో పాడేలా చేశారనే కూడా ఆరోపించారు.
ఈ పాఠశాలపై వచ్చి ఆరోపణల నేపథ్యంలో దామోహ్ జిల్లా కలెక్టర్ మయాంక్ అగర్వాల్ విచారణకు హైపవర్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ వివాదం నేపథ్యంలో మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ స్పందించారు. ‘‘మా కూతుళ్లు తలలు కప్పుకుని బలవంతంగా పాఠశాలకు వస్తున్నారని నాకు తెలిసింది. ఇలాంటి చర్యలను ఎంపీలో సహించేది లేదని ప్రతి ఒక్కరినీ హెచ్చరిస్తున్నాను. నరేంద్ర మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యావిధానం మాత్రమే రాష్ట్రంలో వర్తిస్తుంది. నూతన విద్యావిధానానికి అనుగుణంగా లేకుండా ఏ పాఠశాల బోధించినా.. విద్యార్థినులు కండువా లేదా తల కప్పుకునే మరేదైనా ధరించాలని బలవంతం చేసినా మధ్యప్రదేశ్ లో కార్యకలాపాలు నిర్వహించడానికి అనుమతించబోము’’ అని ఆయన స్పష్టం చేశారు.