హైఅలెర్ట్.. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. పెను తుఫానుగా మారే ఛాన్స్..
బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వల్ల ఏపీలో భారీ వర్షాలు కురిసే అావకాశం ఉంది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.
హైఅలెర్ట్.. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. పెను తుఫానుగా మారే ఛాన్స్..
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది మరింత బలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీని ప్రభావంతో రేపటి నుంచి రెండు, మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉంది. అండమాన్ నికోబార్ దగ్గర ఏర్పడిన ఈ అల్పపీడనం క్రమంగా బలపడుతూ వస్తోంది. దీంతో ఇది వాయుగుండంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది పెనుతుఫానుగా కూడా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే జరిగితే దీనికి జావద్ అని పేరు ఖరారు చేసే అవకాశం ఉన్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఈ తుఫాను ప్రభావం దక్షిణ ఒడిస్సా, ఏపీపై పడనుంది. ఏపీలోని ఉత్తర కోస్తా ఆంధ్రపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలపై పడనుంది. దీంతో ఆ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
తెలంగాణలోనూ ప్రభావం..
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం తెలంగాణ రాష్ట్రంపై పడనుంది. ఈ తుఫాను వల్ల నేడు రాత్రి, రేపు తెలంగాణలో అక్కడక్కడ వర్షం పడే సూచనలు ఉన్నట్టు హైదరాబాద్ వాతావారణ కేంద్రం అధికారులు తెలిపారు. ఏపీలో తుఫాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు అధికారులు అన్ని చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే ఆయా జిల్లా అధికారులకు ఈ విషయంలో సమాచారం అందింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లా వాసులు తుఫాను పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు ప్రజలకు సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.
ఈ తుఫాన్ వల్ల సముద్ర పరిస్థితితి చాలా మారిపోతుందని చెప్పారు. సముద్రం అలలు ఎగిసిపడతాయని, అదే విధంగా గాలులు అధికంగా వీచే అవకాశం ఉందని తెలిపారు. ఈ గాలుల వేగం కూడా గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఉండే అవకాశం ఉందని హెచ్చరించారు. మరి కొన్ని చోట్ల 80 నుంచి 90 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని అన్నారు. డిసెంబర్ 5వ తేదీ వరకు ఇలాంటి ప్రభావం కనిపించనుందని అన్నారు. దక్షిణ కోస్తాలో దీని ప్రభావంతో చిరు జల్లులు కురుసే ఛాన్స్ ఉంది. రాయలసీమ ప్రాంతంలో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. విద్యాశాఖ అధికారులు చిత్తూరు, కడప జిల్లాలోని స్కూల్ లకు సెలవులు ప్రకటించారు. ఈ తుఫాను ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ అధికారులు హెచ్చరించిన నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.
పలు రైళ్లు రద్దు..
జావద్ తుఫాన్ ప్రభావం వల్ల పలు రైళ్లను కూడా అధికారులు రద్దు చేశారు. నేటి నుంచి మూడు రోజుల పాటు 95 రైళ్లను రద్దు చేస్తున్నామని ఇప్పటికే రైల్వే శాఖ అధికారులు తెలిపారు. ఈ మేరకు తూర్పు కోస్తా రైల్వే ప్రకటన విడుదల చేశారు. డిసెంబర్ 5వ తేదీన పరిస్థితిని సమీక్షించి తరువాత ప్రకటన విడుదల చేస్తామని అధికారులు తెలిపారు.