Trains Cancelled: జవాద్ తుపాన్ ఎఫెక్ట్.. పెద్ద సంఖ్యలో రైళ్లు రద్దు.. వివరాలు ఇవే..
ఉత్తరాంద్ర, దక్షిణ ఒడిశాలకు తుపాన్ (Cyclone Jawad) ముప్పు పొంచి ఉంది. ఈ క్రమంలోనే అప్రమత్తమైన దక్షిణ మధ్య రైల్వే (south central railway).. డిసెంబర్ 3,4 తేదీల్లో పలు రైళ్లను రద్దు (Trains Cancelled) చేసింది.
ఉత్తరాంద్ర, దక్షిణ ఒడిశాలకు జవాద్ తుపాన్ (Cyclone Jawad) ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి తుపాన్గా మారనుంది. అది.. డిసెంబర్ 4వ తేదీ ఉదయం నాటికి ఇది ఉత్తరాంధ్ర- ఒడిశా తీరాలకు చేరుకుని మరింతగా బలపడే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. డిసెంబర్ 5, 6 తేదీల్లో తీవ్ర తుపానుగా మారి శ్రీకాకుళం, ఒడిశా మధ్య తీరం దాటే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే ఈ ప్రభావంతో శుక్రవారం నుంచి ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలతో పాటుగా.. దక్షిణ ఒడిశాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది.
ఈ క్రమంలోనే అప్రమత్తమైన దక్షిణ మధ్య రైల్వే.. డిసెంబర్ 3,4 తేదీల్లో పలు రైళ్లను రద్దు (Trains Cancelled) చేసింది. వీటిలో పూరి- తిరుపతి, హౌరా-హైదరాబాద్, భువనేశ్వర్- సికింద్రాబాద్, రాయగడ- గుంటూరు, హౌరా- సికింద్రాబాద్ సర్వీసులు కూడా ఉన్నాయి. ఇందుకు సంబంధించిన పూర్తి జాబితాను దక్షిణ మధ్య రైల్వే ట్విట్టర్లో పోస్ట్ చేసింది. మరోవైపు తుపాన్ నేపథ్యంలో East Coast Railway కూడా పెద్ద ఎత్తున రైళ్లను రద్దు చేసింది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిపింది. ప్రయాణికులు సహకరించాలని కోరింది.
ఇక, తుపాన్ ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర (North Coastal Andhra pradesh), దక్షిణ ఒడిశా జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ఏపీ విషయానికి వస్తే డిసెంబర్ 2 నుంచి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో.. డిసెంబర్ 2వ తేదీ నుంచే భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. తుఫాన్ తీరం దాటే సమయంలో గంటకు 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు.