కరుణానిధి అంత్యక్రియలు: విచారణ బుధవారానికి వాయిదా
డీఎంకె చీఫ్, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి అంత్యక్రియలను మేరీనాబీచ్ వద్ద నిర్వహించే విషయమై డీఎంకె మద్రాస్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను బుధవారం ఉదయానికి కోర్టు వాయిదా వేసింది.
చెన్నై: డీఎంకె చీఫ్, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి అంత్యక్రియలను మేరీనాబీచ్ వద్ద నిర్వహించే విషయమై డీఎంకె మద్రాస్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను బుధవారం ఉదయానికి కోర్టు వాయిదా వేసింది.
చెన్నైలోని మేరీనాబీచ్ లో కరుణానిధి అంత్యక్రియలు నిర్వహించాలని కరుణానిధి కుటుంబసభ్యులు భావిస్తున్నారు. ఈ మేరకు అనుమతివ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. అన్నాదురై సమాధి పక్కనే కరుణానిధి అంత్యక్రియల నిర్వహణకు సహకరించాలని ప్రభుత్వాన్ని కోరారు.
అయితే మేరీనాబీచ్ లో అంత్యక్రియల నిర్వహణకు తమిళనాడు సర్కార్ అంగీకరించలేదు. గాంధీ మండపం వద్ద అంత్యక్రియల నిర్వహణకు అంగీకరించింది. ఈ మేరకు రెండు ఎకరాల స్థలాన్ని కేటాయించింది.
దీంతో మద్రాస్ హైకోర్టులో డీఎంకె పిటిషన్ దాఖలు చేసింది.ఈ పిటిషన్ పై మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ తో పాటు మరో జడ్జి విచారణ జరిపారు. బుధవారం తెల్లవారుజాము వరకు వాదనలు జరిగాయి.
మంగళవారం రాత్రి పదిన్నర గంటలకు డీఎంకె పిటిషన్ పై మద్రాస్ హైకోర్టు విచారణను చేపట్టింది. బుధవారం తెల్లవారుజాము వరకు వాదనలు జరిగాయి. తమిళనాడు రాష్ట్ర అడ్వకేట్ జనరల్ అందుబాటులో లేకపోవడంతో సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ వైద్యనాథన్ రాష్ట్ర ప్రభుత్వం తరుపున కోర్టులో వాదనలను విన్పించారు.
మేరీనాబీచ్ లో అంత్యక్రియల నిర్వహణ వల్ల పర్యావరణానికి విఘాతం కలిగే అవకాశం ఉందని ప్రభుత్వం అబిప్రాయపడింది.అయితే వాదనలను విన్న కోర్టు విచారణను బుధవారం ఉదయం 8 గంటలవరకు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకొంది.
మేరీనా బీచ్ లో అంత్యక్రియల నిర్వహణ విషయమై హైకోర్టు లాయర్ దొరైస్వామి పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్ కూడ కరుణానిధి అంత్యక్రియల విషయంలో అడ్డంకిగా మారింది.
ఈ విషయాన్ని గ్రహించిన దొరైస్వామి కోర్టులో దాఖలు చేసిన కేసులను ఉపసంహరించుకొంటామని ప్రకటించారు.అయితే బుధవారం నాడు డీఎంకె పిటిషన్ పై మద్రాస్ హైకోర్టు విచారణను ప్రారంభించనుంది.కోర్టు తీర్పు ఎలా ఉంటుందనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది.