అవినీతిని అడ్డుకునే చర్యలను వ్యతిరేకిస్తున్నాయి: బెంగుళూరులో విపక్షాల భేటీపై మోడీ ఫైర్
బెంగుళూరులో విపక్ష పార్టీల సమావేశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అవినీతిపరులంతా ఒకేచోట సమావేశమౌతున్నారన్నారు.

న్యూఢిల్లీ:అవినీతిని అడ్డుకునే చర్యలను విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మండిపడ్డారు. అవినీతి పరులంతా బెంగుళూరులో సమావేశమౌతున్నారని ఆయన విమర్శలు గుప్పించారు.
బెంగుళూరులో విపక్ష పార్టీల సమావేశంపై ప్రధాన మంత్రి నరేంద్రమోడీ తీవ్ర విమర్శలు చేశారు. మంగళవారంనాడు పోర్ట్ బ్లెయిర్ లో వీర్ సావర్కర్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని కొత్త ఇంటిగ్రేటేడ్ టెర్మినల్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. ఇవాళ బెంగుళూరులో అవినీతిపరులు సమావేశమౌతున్నారన్నారు.2024 ఎన్నికల్లో మరోసారి బీజేపీని గెలిపించాలని ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారన్నారు. దీంతో భారతదేశ దుస్థితికి కారణమైన వ్యక్తులు దుకాణాలు తెరిచారని ఆయన ఎద్దేవా చేశారు.
స్వంత లాభం కోసం విపక్షాలు పనిచేస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విమర్శలు చేశారు. తమ 9 ఏళ్ల పాలనలో ఎంతో అభివృద్ధి చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. యూపీఏ పాలనలో ఏం చేశారని ఆయన విమర్శించారు. కొన్ని పార్టీలు తమ కుటుంబాల కోసమే పనిచేస్తున్నాయన్నారు. కొన్ని పార్టీలు ప్రతీకార రాజకీయాలు చేస్తున్నాయని ఆయన విమర్శించారు.తమ కుటుంబాలను కాపాడుకోసమే విపక్షాలు పనిచేస్తున్నాయని ఆయన విమర్శలు చేశారు. కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు స్వార్థ రాజకీయాలు చేస్తున్నాయన్నారు. బెంగాల్ పంచాయితీ ఎన్నికల్లో హింస చెలరేగిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. బెంగాల్ పంచాయితీ ఎన్నికల సందర్భంగా జరిగిన హింసలో కాంగ్రెస్, లెఫ్ట్ కార్యకర్తలు మరణించారన్నారు. తమ కార్యకర్తలను గాలికొదిలి కాంగ్రెస్, లెఫ్ట్ కార్యకర్తలు టీఎంసీతో జతకట్టాయని మోడీ విమర్శలు గుప్పించారు. బెంగాల్ పంచాయితీ ఎన్నికల్లో జరిగిన హింస గురించి విపక్ష పార్టీలు ఎందుకు మాట్లాడడం లేదని ఆయన ప్రశ్నించారు.
కుటుంబ పార్టీలు ఏనాడూ యువత గురించి ఆలోచించలేదన్నారు. యూపీఏ హయంలో గిరిజనుల అభివృద్ధిని విస్మరించారని మోడీ పేర్కొన్నారు