Republic Day 2022 : ఈ గణతంత్ర వేడుకల ‘‘రాజ్ పథ్’’లో కొత్తగా ఏం ఉంటాయంటే ?
73వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భారత వైమానికి దళానికి చెందిన విమనాలు ప్రత్యేక విన్యాసాలు ఇవ్వనున్నాయి. ఇందులో పాత తరం విమనాలతో పాటు అత్యాధునిక విమానాలు పాల్గొనన్నాయి. ఈ వీడియోలను దేవ ప్రజలు వీక్షించడానికి వీలుగా దూరదర్శన్తో IAF ఒప్పందం చేసుకుంది.
దేశం మొత్తం గణతంత్ర వేడుకలు చేసుకునేందుకు సిద్ధమైంది. బ్రిటీష్ బానిస సంకెళ్ల నుంచి విముక్తి అయి, స్వాతంత్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటోంది. అందుకే కేంద్ర ప్రభుత్వం ‘అజాదీకా అమృత్ మహోత్సవ్’ పేరిట ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతోంది. అందులో భాగంగా ఢిల్లీలో జరిగే రాజ్ పథ్ వేడుకలను ఘనంగా నిర్వహించాలని భావిస్తోంది. దీని కోసం ప్రత్యేక ఏర్పాటు చేసింది.
సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకొని ఈ సారి ఈ నెల 23వ తేదీ నుంచే 73వ గణతంత్ర వేడుకలు ప్రారంభమయ్యాయి. అవి ఈ నెల 30వ తేది వరకు కొనసాగనున్నాయి. అందులో భాగంగా నేడు గణతంత్ర దినోత్సవం సందర్భంగా చేపట్టే ‘‘రాజ్ పథ్’’ ను కొత్తగా, మరింత ఆకర్షణీయంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకల్లో మొదటి సారిగా భారత వైమానికి దళానికి చెందిన (IAF) 75 విమనాలు ప్రదర్శన ఇవ్వనున్నాయి. ఇందులో పాత కాలపు, అలాగే అత్యాధునికమైన రాఫెల్, సుఖోయ్, జాగ్వార్, Mi-17, సారంగ్, అపాచీ, డకోటా వంటి హెలికాప్టర్లు రాహత్, మేఘన, ఏకలవ్య, త్రిశూల్, తిరంగా, విజయ్, అమృత్లతో సహా విభిన్న నిర్మాణాలను ప్రదర్శించనున్నాయి. మొట్టమొదటిసారిగా భారత వాయుసేన ప్రదర్శించే విన్యాసాల వీడియోలను చూపించడానికి దూరదర్శన్తో IAF ఒప్పందం చేసుకుంది.
‘బీటింగ్ ది రిట్రీట్’ వేడుక కోసం దేశీయంగా అభివృద్ధి చేసిన 1,000 డ్రోన్ల ద్వారా డ్రోన్ ప్రదర్శనను చేపట్టనున్నారు. కవాతులో భాగంగా దేశ నలు మూలల నుంచి వచ్చిన 480 మంది నృత్యకారులు వందేభారతం నృత్య ప్రదర్శన ఇస్తారు. భారత వైమానిక దళం నిర్వహించే విన్యాసాలను వీక్షించేందుకు వీలుగా రాజ్పథ్ వద్ద కవాతు ఉదయం 10 గంటలకు బదులుగా ఈ సారి 10:30 గంటలకు ప్రారంభం కానుంది.
ప్రస్తుత కోవిడ్-19 పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని గణతంత్ర వేడుకలను వీక్షించే వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రేక్షకులకు సీట్ల సంఖ్య గణనీయంగా తగ్గించారు. ఎక్కువ మంది ఆన్ లైన్ ద్వారానే చూడాలని మొదటి నుంచి కోరుతూ వస్తున్నారు. రెండు డోసులు టీకాలు వేసుకున్న పెద్ద వారికి, ఒక డోసు తీసుకున్న టీనేజర్ల ను మత్రమే అనుమతించనున్నారు. 15 ఏళ్ల కంటే తక్కువ వయసున్న వారికి ప్రవేశం లేదు. ఈ వేడుకలను చూడటానికి ఆటో-రిక్షా డ్రైవర్లు, నిర్మాణ కార్మికులు, సఫాయి కరంచారిలు, ఫ్రంట్లైన్ ఆరోగ్య కార్యకర్తలను ఆహ్వానించారు.
ప్రతీ సంవత్సరం జనవరి 26న న్యూ ఢిల్లీలోని రాజ్పథ్లో జరిగే గణతంత్ర వేడుకల సందర్భంగా భారతదేశం తన సైనిక శక్తిని, సాంస్కృతిక వైవిధ్యాన్ని, సామాజిక, ఆర్థిక పురోగతిని ప్రదర్శిస్తుంది. నేడు ఈ గణతంత్ర దినోత్సవ పరేడ్ వేడుకలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ యుద్ధ స్మారకాన్ని సందర్శించడంతో ప్రారంభమవుతాయి. దేశం కోసం అసువులు బాసిన వీరులకు పుష్పగుచ్ఛం ఉంచి నివాళులు అర్పిస్తారు. ఆ తర్వాత, ప్రధాన మంత్రి, ఇతర ప్రముఖులు కవాతును వీక్షించడానికి రాజ్పథ్లోని సెల్యూటింగ్ డేస్కు వెళతారు. సాంప్రదాయం ప్రకారం, జాతీయ జెండాను ఆవిష్కరించారు, తరువాత జాతీయ గీతం అలాపన అయిపోయిన తరువాత 21 తుపాకులతో వందనం అర్పిస్తారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గౌరవ వందనం స్వీకరించడంతో పరేడ్ ప్రారంభమవుతుంది.