Gyanvapi Mosque: ఒక వర్గాన్ని రెచ్చగొడుతున్న అసదుద్దీన్ ఓవైసీ : బీజేపీ
Gyanvapi Mosque: జ్ఞానవాపి మసీదు వివాదం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే అసదుద్దీన్ ఒవైసీ ఒక వర్గాన్ని రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.
BJP: వారణాసిలోని జ్ఞానవాపి మసీదులో సర్వేను వ్యతిరేకిస్తున్నందుకు ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై భారతీయ జనతా పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒవైసీ ఒక వర్గాన్ని రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మైనార్టీ మోర్చా అధికార ప్రతినిధి సయ్యద్ యాసర్ జిలానీ మీడియాతో మాట్లాడుతూ.. ఒవైసీపై విమర్శలు గుప్పించారు. అసదుద్దీన్ ఒవైసీ దెయ్యాల పని చేస్తున్నాడంటూ దుయ్యబట్టారు. భారత రాజ్యాంగం ప్రకారం ఏ పని చేసినా వ్యతిరేకించడంలో ఒవైసీకి పేరుందని విమర్శించారు. ఆయన 1991 చట్టంలోని ఆర్టికల్ 6 గురించి మాట్లాడాడు. కానీ, ఆయన ఆరాధనకు సంబంధించిన ఆర్టికల్ 4 గురించి ఎందుకు చర్చించలేదని ప్రశ్నించారు. ఏదైనా మంచి పనిని అన్ని విధాలుగా అడ్డుకోవడమే అసదుద్దీన్ ఒవైసీ పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. ప్రస్తుత అంశానికి సంబంధించిన వాస్తవాలను కోర్టు ముందుంచాలని జిలానీ అన్నారు.
“ఏ వాస్తవాలు బయటకు వస్తాయో ప్రజలకు తెలియజేయండి. మీకు (ఒవైసీ) భారత రాజ్యాంగంపై నమ్మకం ఉందా లేదా? మీకు నమ్మకం ఉంటే, మీరు వేచి ఉండాలి. కానీ, అసదుద్దీన్ ఒవైసీ నిరంతరం ఒక వర్గాన్ని, ఒక సమూహాన్ని రెచ్చగొట్టేందుకు, ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ, బాధితులతో ఆడుకుంటున్నారు” అని జిలానీ ఆరోపించారు. జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో శివలింగాన్ని కనుగొన్న అంశానికి సంబంధించి మీడియా ఆడిగిన ప్రశ్నిలకు జిలానీ స్పందిస్తూ.. “భారత ప్రజలు న్యాయస్థానాన్ని విశ్వసిస్తున్నారు. సర్వే రిపోర్టును కోర్టు తగిన విధంగా పరిగణలోకి తీసుకుంటుందని నమ్ముతున్నాను. ఎదుటి పక్షం ఉన్న వారందరికీ సుప్రీంకోర్టుకు వెళ్లే హక్కు కూడా ఉంది. మన రాజ్యాంగం అందరికీ ఒకే అధికారాన్ని ఇచ్చింది” అని తెలిపారు.
కాశీ-విశ్వనాథ దేవాలయం-జ్ఞానవాపి మసీదు అంశంపై వారణాసి కోర్టు ఇచ్చిన తీర్పు తప్పు, అన్యాయం మరియు చట్టవిరుద్ధమని ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ మంగళవారం పేర్కొన్నారు. అంతకుముందు అంటే సోమవారం, వారణాసి కోర్టు.. కాంప్లెక్స్ లోపల సర్వే చేసే ప్రదేశానికి సీలు వేయాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది.. అక్కడ సర్వేయింగ్ బృందం శివలింగాన్ని కనుగొన్నది. వారణాసిలోని కాశీ విశ్వనాథ దేవాలయం-జ్ఞానవాపి మసీదు సముదాయంలోని కోర్టు ఆదేశించిన వీడియోగ్రఫీ సర్వే మూడవ రోజు సోమవారం ముగియడంతో, ఈ కేసులో హిందూ పిటిషనర్, సోహన్ లాల్ ఆర్య కమిటీ కాంప్లెక్స్ వద్ద శివలింగాన్ని కనుగొన్నట్లు పేర్కొన్నారు.
మసీదు సర్వే కోసం కోర్టు కమీషన్తో పాటు వచ్చిన ఆర్య, తమకు నిశ్చయాత్మకమైన ఆధారాలు దొరికాయని చెప్పారు. మసీదు అధికారులు అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ సర్వే కొనసాగించాలని వారణాసి సివిల్ కోర్టు ఆదేశాలకు అనుగుణంగా సర్వే నిర్వహించారు. సర్వే ముగిసిన తర్వాత, వారణాసి కోర్టు వారణాసి జిల్లా మేజిస్ట్రేట్ కౌశల్ రాజ్ శర్మకు.. శివలింగం దొరికిన ప్రదేశానికి ముసివేయాలనీ, భద్రత కల్పించాలని ప్రజలు ఆ ప్రాంతానికి వెళ్లకుండా నిషేధించాలని పేర్కొంది. సీల్డ్ ఏరియా భద్రతకు డీఎం, పోలీస్ కమిషనర్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) కమాండెంట్ వారణాసి బాధ్యత వహిస్తారని కోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే, ప్రస్తుతం ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. దీనిపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది.