గుజరాత్ లో ఫేక్ కరెన్సీ కలకలం.. రూ.317 కోట్లు సీజ్.. ఆరుగురి అరెస్ట్..
గుజరాత్లోని సూరత్లో ఫేక్ కరెన్సీ ముఠాకు చెందిన ఆరుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు. వారి నుంచి రూ.317 కోట్ల నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. వీటిలో రూ.67 కోట్లు రద్దైన రూ.500, రూ.1000 నోట్ల ఉన్నట్టు తెలిపారు. బ్లాక్ కరెన్సీని వైట్ మనీలా మారుస్తామంటూ పలువురిని ఈ ముఠా మోసం చేసి డబ్బులు వసూలు చేస్తున్నట్టు తెలుస్తుంది.
గుజరాత్ లోని సూరత్ నకిలీ నోట్ల కలకలం చెలారేగింది. దాదాపు 67 కోట్ల పాత నోట్లు, 317 కోట్ల కొత్త నకిలీ నోట్లతో ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నల్లధనాన్ని తెల్లగా మార్చుకునేందుకు నిందితులు ట్రస్ట్, కంపెనీ, కమీషన్ పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారు. ఈ నకిలీ నోట్లను ముద్రిస్తున్న ప్రింటర్లను స్వాధీనం చేసుకునేందుకు మరో రెండు బృందాలను పోలీసులు ఏర్పాటు చేశారు. అరెస్టు చేసిన నిందితులపై పోలీసులు 489, 406, 420, 201, 120 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
సమాచారం మేరకు సెప్టెంబర్ 29న అంబులెన్స్లో రూ.25 కోట్ల 80 లక్షల విలువైన నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నట్లు రూరల్ పోలీసు సూపరింటెండెంట్ హితేష్ కుమార్ హన్సరాజ్ తెలిపారు. ఈ క్రమంలో ముగ్గురు నిందితులను కూడా అరెస్టు చేశారు. వారి సూచన మేరకు రూ.52 కోట్ల పాత, రూ.12 కోట్ల నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. అప్పటి నుంచి పోలీసులు ప్రధాన నిందితుడి కోసం గాలిస్తున్నారు.
ఆ ముఠాకు చెందిన ప్రధాన నిందితుడు వికాస్ జైన్ను ముంబైకి చెందిన పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన ఇతర వ్యక్తులకు నకిలీ నోట్లను సరఫరా చేసేవారు. ఈ ముఠా గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఢిల్లీలో కొరియర్ కార్యాలయాలను ప్రారంభించింది. ఉత్తర భారతదేశంలోని వివిధ నగరాల్లో ముద్రించిన నకిలీ నోట్లను జైన్ తన కొరియర్ సర్వీస్ ద్వారా ముంబైకి పంపేవాడని గుర్తించారు. ఈ క్రమంలో మహారాష్ట్రలోని ఓ గోడౌన్లో నకిలీ నోట్లను దాచారు. ఒక్క ముంబైలోనే రూ.227 కోట్ల విలువైన నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.