ఆలుమగల మధ్య గొడవ.. చిన్నారితో సహా 12వ అంతస్థు నుంచి దూకి దంపతుల ఆత్మహత్య
క్షణికావేశంలో గొడవ పడి దంపతులు ఆత్మహత్యకు పాల్పడాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరూ కలిసి తమ చిన్నారి కూతురును వెంటబెట్టుకుని 12వ అంతస్థు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన అహ్మదాబాద్లోని వస్త్రాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలు తీవ్ర విషాదాన్ని మిగులుస్తాయి. ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు ఇటీవలి కాలంలో బాగా పెరుగుతున్నాయి. తల్లిదండ్రులు తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాల వల్ల అభం శుభం తెలియని పిల్లలు బలవుతున్నారు. తాజాగా అహ్మదాబాద్లోని వస్త్రాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక జంట గొడవ పడి.. భార్యభర్తలిద్దరూ తమ కుమార్తెతో కలిసి 12వ అంతస్తు నుంచి బుధవారం దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. భార్యాభర్తల మధ్య పరస్పర విబేధాలే ఈ ఘటనకు కారణమని తెలుస్తోంది.
ఈ ఘటనపై సోలా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎన్ఆర్ వాఘేలా మాట్లాడుతూ.. గొడవల కారణంగానే దంపతులు ఈ ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని తెలిపారు. మృతుడు అహ్మదాబాద్లోని వస్త్రాపూర్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ కులదీప్ సింగ్ యాదవ్గా గుర్తించారు.యాదవ్ తన భార్య, కుమార్తెతో కలిసి గోటా ప్రాంతంలోని ఓ అపార్ట్ మెంట్ లోని 12 వ అంతస్తులో నివసించినట్లు తెలిపారు.
యాదవ్ కి తన భార్య రిద్ధితో ఎప్పుడూ గొడవలు జరుగుతుండేవి. ఘటన జరిగిన రోజు రాత్రి కూడా ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో మనస్థానికి గురైన దంపతులు అర్థరాత్రి 1.30 గంటల సమయంలో కుమార్తెతో కలిసి 12వ అంతస్తు నుంచి దూకినట్లు ఇరుగుపొరుగు వారు చెబుతున్నారు.
ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. తొలుత యాదవ్ భార్య రిద్ధి ముందుగానే దూకిందని, ఆ తర్వాత యాదవ్ తన కుమార్తెతో కలిసి దూకాడని ప్రత్యక్ష సాక్షి మీడియాకు తెలిపారు. ఇదే అపార్ట్ మెంట్ లో నివసిస్తున్నయాదవ్ సోదరి తెలిపిన వివరాల ప్రకారం.. ఇద్దరు భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవని విచారణలో తేలిందని పోలీసు అధికారి తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించి ఘటనపై దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.