గుజరాత్ పంచాయితీరాజ్ క్లర్క్ పరీక్ష ప్రశ్నాపత్రం లీక్: హైద్రాబాద్లో పోలీసుల దర్యాప్తు
గుజరాత్ పంచాయితీరాజ్ క్లర్క్ పరీక్ష రద్దైంది. ప్రశ్నాపత్రం లీకేజీ కారణంగా ఈ పరీక్షను అధికారులు నిలిపివేశారు.
హైదరాబాద్: గుజరాత్ పంచాయితీరాజ్ క్లర్క్ పరీక్ష పేపర్ లీకేజీకి సంబంధించి పోలీసులు హైద్రాబాద్ లో దర్యాప్తు చేస్తున్నారు. గుజరాత్ పంచాయితీ క్లర్క్ రిక్రూట్ మెంట్ పరీక్ష 2023 పేపర్ లీక్ కావడంతో ఇవాళ జరగాల్సిన పరీక్షను రద్దు చేశారు. మేరకు గుజరాత్ పంచాయిత్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు నోటిఫికేషన్ జారీ చేసింది.ఈ పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రాలు హైద్రాబాద్ లో ముద్రించారు. అయితే ఈ పరీక్ష పేపర్లు ఒడిశాలో లీకైనట్టుగా అధికారులు అనుమానిస్తున్నారు. దీంతో గుజరాత్ ఏటీఎస్ అధికారులు పేపర్ల లీకేజీకి సంబంధించి హైద్రాబాద్ లో దర్యాప్తు నిర్వహిస్తున్నారు.
ప్రశ్నాపత్రాల లీకేజీకి సంబంధించి ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రశ్నాపత్రాలు ఎలా లీకయ్యాయనే విషయమై పోలీసులు విచారిస్తున్నారు. ఇవాళ పరీక్షను రద్దు చేయడంతో అభ్యర్ధులు ఆందోళనలు నిర్వహించారు. పరీక్షలు ఎప్పుడు నిర్వహించనున్నామో త్వరలోనే ప్రకటించనున్నట్టుగా జీపీఎస్ఎస్ఈబీ ప్రకటించింది. 1150 జూనియర్ క్లర్క్ పోస్టుల కోసం తొమ్మిది లక్షల మంది అభ్యర్ధులు ధరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్రంలో 12 ఏళ్లలో ప్రశ్నాపత్రాల లీకేజీ కారణంగా రద్దు చేసిన 15వ పోటీ పరీక్షగా కాంగ్రెస్ విమర్శించింది. ప్రశ్నాపత్రాల లీకేజీకి సంబంధించిన నిందితులపై చర్యలు తీసుకొంటే ఈ తరహ ఘటనలు పునరావృతం కావని కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనీష్ దోషీ చెప్పారు.