32 ఏళ్లుగా అధికారానికి కాంగ్రెస్ దూరం: గుజరాత్లో ఉనికి కోసం కాంగ్రెస్ పోరాటం
1990 తర్వాత గుజరాత్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరంగా ఉంది. 1985లో రికార్డు మెజారిటీతో అధికారంలో కొనసాగింది కాంగ్రెస్ పార్టీ. కానీ ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరమైంది.
న్యూఢిల్లీ: గుజరాత్ రాష్ట్రంలో 1985 తర్వాత ఏ ఒక్క ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు. 32 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ గుజరాత్ రాష్ట్రంలో అధికారానికి దూరంగా ఉంది. ఒకప్పుడు ఈ రాష్ట్రంలో వరుస విజయాలు సాధించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తన ఉనికిని కాపాడుకొనేందుకు కష్టాలు పడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఈ రాష్ట్రానికి చెందినవారే. దీంతో ఈ రాష్ట్రంలో బీజేపీ విజయం కోసం మోడీ, అమిత్ షా విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. సుమారు రెండు నెలల పాటు అమిత్ షా గుజరాత్ లో మకాం వేసి బీజేపీ విజయంలో కీలక పాత్ర పోషించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో సుమారు 40 మందికిపైగా బీజేపీ ఈ దఫా టికెట్లు ఇవ్వలేదు. టిక్కెట్లు దక్కని 19 మంది రెబెల్స్ గా బరిలోకి దిగినా కూడా బీజేపీ విజయాలపై ప్రభావం చూపలేకపోయింది.
1962లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో 113 స్థానాల్లో విజయం సాధించింది.1967లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 93 స్థానాల్లో విజయం సాధించింది. 1972లో కాంగ్రెస్ పార్టీ 140 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది. 1975 లో కాంగ్రెస్ పార్టీ అంతకు ముందు ఎన్నికల కంటే తక్కువ స్థానాల్లో విజయం సాధించింది. 75 స్థానాల్లో మాత్రమే ఆ పార్టీ విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో ఎన్సీఓకు 56 స్థానాలు దక్కాయి.1980లో కాంగ్రెస్ పార్టీ మళ్లీ పుంజుకుంది. ఈ ఎన్నికల్లో 141 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. 1985లో కాంగ్రెస్ పార్టీ 149 స్థానాల్లో గెలుపొందింది. 1985 తర్వాత గుజరాత్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు.
1990 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 33 స్థానాలకే పరిమితమైంది. ఈ ఎన్నికల్లో జనతాదళ్ 70 స్థానాల్లో, బీజేపీ 67 స్థానాల్లో గెలుపొందింది. జనతాదళ్, బీజేపీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.1995 నుండి గుజరాత్ రాష్ట్రంలో బీజేపీ అధికారాన్ని కొనసాగిస్తుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 45 స్థానాలు దక్కాయి. 1998లో బీజేపీ కి 117 స్థానాలు దక్కాయి.కాంగ్రెస్ పార్టీకి 53 స్థానాల్లో విజయం సాధించింది. 2002లో 51, 2007లో 59, 2012లో 61, 2017లో 78 స్థానాల్లో విజయం సాధించింది. గత ఎన్నికల్లో వచ్చిన సీట్లు కూడా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కు దక్కేలా లేవు. దీనికి అనేక రకాల కారణాలు కన్పిస్తున్నాయి.
1990 తర్వాత మారిన రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాలను రచించడంలో కాంగ్రెస్ పార్టీ వైఫల్యం చెందింది. దీంతో కాంగ్రెస్ పార్టీకి గుజరాత్ రాష్ట్రంలో విజయం సాధించడం లేదు. గుజరాత్ రాష్ట్రంలో బీజేపీ తన పునాదిని సుస్థిరం చేసుకొంది. అదే సమయంలో ఆప్ వంటి పార్టీలు కూడా గుజరాత్ రాష్ట్రంలో ప్రవేశించాయి. గత ఎన్నికలతో పోలిస్తే ఆప్ గణనీయమైన ఓట్లను సాధించింది. ప్రత్యర్ధుల వ్యూహాలను చిత్తు చేసే రీతిలో కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు లేవు. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపాయి.
also read:సీపీఎం రికార్డు సమం చేసిన కమలం: నాడు బెంగాల్ లో లెఫ్ట్ ఫ్రంట్, నేడు గుజరాత్లో బీజేపీ వరుస విజయాలు
గుజరాత్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి బలమైన నాయకుడు లేకుండా పోయాడు. గుజరాత్ లో సామాజిక సమీకరణాలను ఆసరాగా చేసుకొని సోషల్ ఇంజనీరింగ్ చేయడంలో కాంగ్రెస్ పార్టీ వైఫల్యం చెందింది. దీంతో బీజేపీ వ్యూహల ముందు కాంగ్రెస్ పార్టీ బొర్లాపడింది. పాటీదార్ల ఉద్యమం గుజరాత్ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూనుంది. పాటీదార్ల ఉద్యమంలో హార్ధిక్ పటేల్ కీలక పాత్ర పోషించారు. హర్దిక్ పటేల్ ఎన్నికల ముందే బీజేపీలో చేరారు. ఆప్ భారీగా కాంగ్రెస్ పార్టీ ఓట్లను చీల్చింది. ఆదీవాసీ ఓట్లను కూడా కాంగ్రెస్ పార్టీ కోల్పోయింది.