సీపీఎం రికార్డు సమం చేసిన కమలం: నాడు బెంగాల్ లో లెఫ్ట్ ఫ్రంట్, నేడు గుజరాత్లో బీజేపీ వరుస విజయాలు
గుజరాత్ రాష్ట్రంలో వరుసగా బీజేపీ ఏడో దఫా అధికారంలోకి రానుంది. గతంలో బెంగాల్ రాష్ట్రంలో సీపీఎం ఏడు సార్లు అధికారంలోకి వచ్చింది.
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో సీపీఎం నేతృత్వంలోని లెఫ్ట్ ప్రంట్ వరుసగా అధికారాన్ని కైవసాన్ని చేసుకున్నట్టే గుజరాత్ రాష్ట్రంలో బీజేపీ వరుసగా ఏడోదఫా అధికారాన్ని కైవసం చేసుకోనుంది. దేశంలో కేరళ రాష్ట్రంలో తొలిసారిగా సీపీఎం నేతృత్వంలో కమ్యూనిష్టు పార్టీ ప్రభుత్వం ఏర్పడింది.అయితే కేరళ రాష్ట్రంలో మాత్రం కమ్యూనిష్టు పార్టీ ప్రభుత్వం వరుసగా ఏర్పడలేదు. కానీ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసుగా ఏడు దఫాలు సీపీఎం నేతృత్వంలోని లెఫ్ట్ ప్రంట్ అధికారాన్ని కైవసం చేసుకుంది.
1995 అసెంబ్లీ ఎన్నికల నుండి వరుస ఎన్నికల్లో బీజేపీ వరుస విజయాలు సాధిస్తుంది. 1985లో తొలిసారిగా బీజేపీ గుజరాత్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. కేశుభాయ్ పటేల్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. 1995లో కాంగ్రెస్ పార్టీ కేవలం 45 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది.1998లో 117 స్థానాల్లో బీజేపీ విజయం సాధించి రెండో దఫా అధికారాన్ని కైవసం చేసుకుంది. 2002లో 127 స్థానాలతో మూడో దఫా బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకొంది. 2007లో 117 స్థానాలతో నాలుగోసారి బీజేపీ దక్కించుకుంది. 2012లో బీజేపీ 115 స్థానాలను గెలుచుకొని ఐదో దఫా అధికారంలో కూర్చుంది. 2017లో 99 అసెంబ్లీ స్థానాలతో ఆరో దఫా అధికారాన్ని కైవసం చేసుకుంది. 2022 ఎన్నికల్లో బీజేపీ రికార్డు విజయం దిశగా వెళ్తున్నట్టుగా ఎన్నికల ఫలితాలు కన్పిస్తున్నాయి. 155 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉందని ఫలితాలు వెల్లడిస్తున్నాయి. ఏడో దఫా కూడా బీజేపీ అధికారాన్ని కైవసం చేసుకొనే అవకాశం ఉందని ఫలితాలు సూచిస్తున్నాయి.
గతంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో సీపీఎం నేతృత్వంలో లెఫ్ట్ ఫ్రంట్ వరుస విజయాలను దక్కించుకుంది. 1977 జూన్ 21న సీపీఎం నేతృత్వంలో తొలిసారిగా లెఫ్ట్ ప్రంట్ ప్రభుత్వం ఏర్పడింది. జ్యోతిబసు సీఎంగా బాధ్యతలు చేపట్టారు.1982లో జరిగిన ఎన్నికల్లో కూడా రెండో దఫా సీపీఎం లెఫ్ట్ ప్రంట్ అధికారంలోకి వచ్చింది. 1987లో జరిగిన ఎన్నికల్లో కూడా మూడో దఫా సీపీఎం నేతృత్వంలో మూడో దఫా ప్రభుత్వం ఏర్పాటైంది. 1991 అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎం నేతృత్వంలో నాలుగో దఫా లెఫ్ట్ ప్రంట్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 1996 ఎన్నికల్లో ఐదో దఫా సీపీఎం అధికారాన్ని దక్కించుకుంది. 2001 ఎన్నికల్లో ఆరో దఫా అధికారంలోకి కూర్చుంది. 2006 ఎన్నికల్లో ఏడో దఫా లెఫ్ట్ ప్రంట్ విజయం సాధించింది.
also read:గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2022: కాంగ్రెస్ను దెబ్బతీసిన ఆప్, చతికిలపడ్డ హస్తం
1977 జూన్ 21 నుండి 2000 నవంబర్ ఆరో తేదీ వరకు పశ్చిమ బెంగాల్ సీఎంగా కొనసాగారు. ఆరోగ్య సమస్యలతో బెంగాల్ సీఎం పదవి నుండి తప్పించారు. జ్యోతిబసు స్థానంలో బుద్ధదేబ్ భట్టాచార్య బెంగాల్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. 2001, 2006 ఎన్నికల్లో బుద్దదేబ్ భట్టాచార్య నేతృత్వంలో బెంగాల్ లో సీపీఎం ఎన్నికలను ఎదుర్కొంది. అయితే 2006 తర్వాత రాష్ట్రంలోని నందిగ్రామ్, సింగూరు ఉద్యమాలు సీపీఎంను తీవ్రంగా దెబ్బతీశాయి. మావోయిస్టులు కూడా తమ ప్రభుత్వాన్ని కుప్పకూల్చేందుకు పరోక్షంగా టీఎంసీకి సహకరించాయని సీపీఎం అప్పట్లో ఆరోపించింది. 2011, 2015 ఎన్నికల్లో బెంగాల్ లో వరుసగా టీఎంసీ విజయం సాధించింది. లెఫ్ట్ ప్రంట్ నామ మాత్రపు విజయాన్ని మాత్రమే నమోదు చేసింది.