గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2022: కాంగ్రెస్ను దెబ్బతీసిన ఆప్, చతికిలపడ్డ హస్తం
కాంగ్రెస్ పార్టీని ఆప్ తీవ్రంగా దెబ్బతీసింది. కాంగ్రెస్ ఓటు బ్యాంకును భారీగా ఆప్ తన వైపునకు తిప్పుకొంది. దీంతో గత ఎన్నికల్లో వచ్చిన సీట్లలో సగం సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీ కూడా దక్కించుకొనే పరిస్థితి లేదు.
న్యూఢిల్లీ: గుజరాత్ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా దెబ్బతింది.గుజరాత్ రాష్ట్రంలో బీజేపీ ఏడో దఫా అధికారంలోకి రానున్నట్టుగా ఎన్నికల ఫలితాలు వెల్లడిస్తున్నాయి. గుజరాత్ లో తన పట్టును నిలుపుకొనేందుకు బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. అయితే గత ఎన్నికల్లో బీజేపీకి కాంగ్రెస్ పార్టీ గట్టిపోటీని ఇచ్చింది. అయితే ఈ దఫా మాత్రం ఆ తరహలో ఎన్నికల ఫలితాలుు ఉండే అవకాశం లేదు. గత ఎన్నికల సమయంలో హర్ధిక్ పటేల్ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం నిర్వహించారు. దళిత ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన జిగ్నేష్ మేవానీ బీజేపీకి వ్యతిరేకంగా విస్తృతంగా ప్రచారం చేశారు. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అహ్మద్ పటేల్ ఆ పార్టీ అభ్యర్ధుల విజయంలో కీలకంగా వ్యవహరించారు. అయితే ఇటీవల కాలంలో ఆయన మరణించారు. అహ్మద్ పటేల్ మరణం కూడా ఆ పార్టీకి తీరని నష్టంగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
గుజరాత్ రాష్ట్రంలో 2017 లో ఆప్ పార్టీ 29 మంది అభ్యర్ధులను బరిలోకి దింపింది. ఆ సమయంలో ఆప్ పార్టీకి 0.1 శాతం ఓట్లు ఆ పార్టీ పొందింది.ఈ దఫా గుజరాత్ లోని 181 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ తన అభ్యర్ధులను బరిలోకి దింపింది. అయితే ఈ దఫా ఆప్ పార్టీకి 24.2 శాతం ఓట్ల శాతం వచ్చే అవకాశం ఉందని సర్వే సంస్థలు అంచనా వేశాయి. కాంగ్రెస్ పార్టీ కంటే ఆప్ పార్టీకి ఆరు శాతం మాత్రమే వెనుకబడి ఉన్నట్టుగా ఈ సంస్థలు అంచనా వేశాయి. 2017 తర్వాత కాంగ్రెస్ పార్టీ సుమారు 15.4 శాతం తన ఓట్లను కోల్పోయే అవకాశం ఉందని కొన్ని సర్వే సంస్థలు అంచనాలు తెలిపాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ గుజరాత్ రాష్ట్రంలో ఈ దఫా తక్కువ స్థానాలతోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఓట్ల శాతాన్ని ఆప్ తన వైపునకు తిప్పుకొంది. కాంగ్రెస్ పార్టీ ఆదీవాసీ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ తన పట్టును కోల్పొయింది. ఇదిలా ఉంటే సౌరాష్ట్ర ప్రాంతంలో బీజేపీ గతంలో బాగా వెనుకబడింది. అయితే ఈ ప్రాంతంలో ఈ దఫా మోడీ విస్తృతంగా పర్యటించారు.ఈ ప్రాంతంలో రోడ్ షోలు, ప్రచార సభలను నిర్వహించారు. ఈ ప్రభావం బీజేపీ అభ్యర్ధుల విజయంలో కీలకపాత్ర పోషించినట్టుగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీకి ఓట్లను ఎంఐఎం చీల్చిందనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 77 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. కానీ ఈ దఫా అన్ని స్థానాలు ఆ పార్టీకి దక్కే అవకాశం లేదు. మరో వైపు గత ఎన్నికల్లో ఆప్ అభ్యర్ధులకు డిపాజిట్లు కూడా దక్కలేదు. కానీ ఈ దఫా ఆప్ అభ్యర్ధులు గణనీయమైన ఓట్లను సాధించనున్నారు. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకును ఆప్ తన వైపునకు తిప్పుకోవడం వల్ల సాధ్యమైందని విశ్లేషకులు భావిస్తున్నారు.
గుజరాత్ ఎన్నికలను బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మోడీ, అమిత్ షా, నడ్డా, పలువురు కేంద్ర మంత్రులు గుజరాత్ రాష్ట్రంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.