షాక్: పెట్రోల్, డీజీల్లను జీఎస్టీ పరిధిలోకి తెచ్చినా ధరలు తగ్గవా.!
పెట్రోల్, డీజీల్ ధరలు తగ్గవా
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజీల్లను జీఎస్టీ పరిధిలోకి తెచ్చినా ధరలు తగ్గే అవకాశం లేకపోవచ్చనే అభిప్రాయాలు కూడ వ్యక్తమౌతున్నాయి. అయితే జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్, డీజీల్ లను తెస్తే ధరలు తగ్గే అవకాశం ఉండకపోవచ్చని ఆయిల్ మంత్రిత్వశాఖకు చెందిన ఓ అధికారి అభిప్రాయపడుతున్నారు. ధరలు తగ్గకపోతే జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్, డీజీల్లను తెస్తే ప్రయోజనమమేమిటని వాదించే వారు కూడ లేకపోలేదు.
జీఎస్టీలో అత్యధిక పన్ను 28 శాతం. అయితే పెట్రోల్, డీజీల్లను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడం వల్ల ధరలు తగ్గుతాయని అందరూ భావించారు. కానీ, జీఎస్టీకి తోడు వ్యాట్ను కూడ జత చేస్తే పెట్రోల్, డీజీల్లు ప్రస్తుతం ఏ ధరకు దొరుకుతోందో అప్పుడు కూడ అదే ధరను చెల్లించాల్సి వస్తోందని ఓ అధికారి అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న ఎక్సైజ్ సుంకానికి తోడు రాష్ట్ర ప్రభుత్వాలు విడివిడిగా వ్యాట్ను కూడా కలిపి వసూలు చేసుకుంటున్నాయి. అయితే జీఎస్టీ కిందకు జంట ఇంధనాల(పెట్రోలు, డీజిల్)ను తీసుకువస్తే మాత్రం ప్రభుత్వం రూ.20,000 కోట్ల ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ (ఐటీసీ)ను కోల్పోవాల్సి వస్తోంది.
ప్రస్తుతం కేంద్రం లీటరు పెట్రోలుపై రూ.19.48; లీటరు డీజిల్పై రూ.15.33 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని కేంద్రం విధిస్తోంది. దీనికి తోడుగా వ్యాట్ ను ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం విడిగా వసూలు చేసుకుంటుంది.
అండమాన్ నికోబార్ దీవుల్లో కనిష్ఠంగా పెట్రోలు, డీజిల్లపై 6% వ్యాట్ విధిస్తోంది. ఇక పెట్రోలుపై అత్యధికంగా ముంబయిలో 39.12 శాతం వ్యాట్ ఉంది. డీజిల్పై అత్యధికంగా తెలంగాణలో 26 శాతం వ్యాట్ ఉంది.
జీఎస్టీ గరిష్టంగా 28 శాతం పన్ను ఉంది. దీన్ని అమలు చేస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నష్టం వాటిల్లే అవకాశం లేకపోలేదని భావిస్తున్నారు.రాష్ట్రాలకు వచ్చే నష్టాలను పూడ్చడానికి కేంద్రం వద్ద తగిన నిధులు లేనందున రాష్ఠ్రాలు పెట్రోల్, డీజీల్ పై వ్యాట్ విధించేందుకు అవకాశం కల్పించాల్సిన అనివార్య పరిస్థితులు తప్పవని ఆ అధికారి అభిప్రాయపడుతున్నారు.