దేశ నిరుద్యోగానికి కేంద్రం చెప్పిన గణాంకాలే నిదర్శనం: బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ
unemployment: దేశంలో గత ఎనిమిది సంవత్సరాలలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం 22 కోట్ల మంది దరఖాస్తు చేసుకోగా, 7.22 లక్షల మంది ఎంపికయ్యారని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అయితే, దేశంలో నిరుద్యోగానికి ప్రభుత్వం చెప్పిన ఈ గణాంకాలు నిదర్శనంగా నిలుస్తున్నాయని బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
BJP MP Varun Gandhi: కేంద్రంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులపై బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ గురువారం మరోసారి ప్రధాని మోడీ సర్కారును టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ పార్లమెంట్ లో వెల్లడించిన లిఖితపూర్వక సమాధానాన్ని పంచుకుంటూ వరుణ్ గాంధీ, 'పార్లమెంట్లో ప్రభుత్వం ఇచ్చిన ఈ గణాంకాలు నిరుద్యోగ పరిస్థితికి నిదర్శనంగా నిలుస్తున్నాయని' పేర్కొన్నారు. "గత 8 సంవత్సరాలలో, 22 కోట్ల మంది యువత కేంద్ర శాఖలలో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. దేశంలో కోటి మంజూరైన ఖాళీలు ఉండగా వారిలో 7 లక్షల మందికి మాత్రమే ఉపాధి లభించింది" అని అని ట్వీట్ చేశారు. ఈ పరిస్థితికి బాధ్యులెవరు?’’ అని ఆయన ప్రశ్నించారు.
ఇది మొదటిసారి కాదు, ఇంతకుముందు కూడా, వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న పోస్టులపై వరుణ్ గాంధీ ప్రభుత్వంపై విమర్శలతో విరుచుకుపడ్డారు. వచ్చే 18 నెలల్లో 10 లక్షల మందిని రిక్రూట్ చేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ వివిధ ప్రభుత్వ శాఖలు, మంత్రిత్వ శాఖలను ఆదేశించారని పీఎంవో చేసిన ప్రకటనపై వరుణ్ గాంధీ స్పందిస్తూ.. కొత్త ఉపాధి అవకాశాలను సృష్టించేందుకు అర్థవంతమైన కృషి చేయాల్సి ఉంటుందని అన్నారు. కోటి పోస్టులు ఖాళీగా ఉన్నాయి.. వీటిని పూరించడానికి సరైన చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు.
జితేంద్ర సింగ్ పార్లమెంటుకు ఏం చెప్పారంటే..?
కేంద్ర ప్రభుత్వ వివిధ విభాగాల్లో ఖాళీ పోస్టులు, ఇప్పటివకు భర్తీ చేసిన పోస్టుల వివరాలు వెల్లడించాలని కాంగ్రెస్ ఎంపీ అనుమల రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే బుధవారం లోక్సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ 2014 నుండి ప్రభుత్వానికి 22 కోట్ల ఉద్యోగాల దరఖాస్తులు వచ్చాయని, వాటిలో 7.22 లక్షల మంది దరఖాస్తుదారులు శాశ్వత ఉద్యోగాలు పొందారని చెప్పారు. అంతేకాకుండా, వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖలలో నియామకం కోసం రిక్రూటింగ్ ఏజెన్సీలు సిఫార్సు చేసిన మొత్తం అభ్యర్థుల సంఖ్య గత కొన్నేళ్లుగా తగ్గుముఖం పట్టిందని ఆయన చెప్పారు. 2019-20లో వివిధ ప్రభుత్వ శాఖల్లో మొత్తం 1,47,096 మందిని నియమించారు. అయితే, ఈ సంఖ్య 2020-21లో 78,555కి, 2021-22లో 38,850కి తగ్గింది.
ఈ క్రమంలోనే కోవిడ్-19 మహమ్మారి సమయంలో ఉపాధి నష్టాన్ని అరికట్టడానికి అక్టోబర్ 2020లో ప్రారంభించిన ఆత్మనిర్భర్ భారత్ రోజ్గార్ యోజన (ARBY)తో సహా దేశంలో ఉపాధిని కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కార్యక్రమాలు, చర్యలను కూడా కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ప్రస్తావించారు. ప్రధాన మంత్రి వీధి వ్యాపారుల ఆత్మనిర్భర్ నిధి పథకం జూన్ 2020లో వీధి వ్యాపారులకు వారి వ్యాపారాలను పునఃప్రారంభించేందుకు మూలధన రుణాన్ని అందించడానికి చర్యలు తీసుకున్నారని తెలిపారు. ఇది కాకుండా, 2021-22 బడ్జెట్లో ఉత్పత్తి-లింక్డ్ ఇన్సెంటివ్ పథకం ₹ 1.97 లక్షల కోట్లతో ప్రారంభించబడింది. ఇది 60 లక్షల కొత్త ఉద్యోగాలను సృష్టించే అవకాశం కూడా ఉందన్నారు. ఈ పథకాలతో పాటు, మేక్ ఇన్ ఇండియా, స్టార్ట్-అప్ ఇండియా, పునరుజ్జీవనం- పట్టణ పరివర్తన కోసం అటల్ మిషన్, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, డిజిటల్ ఇండియా, స్మార్ట్ సిటీ మిషన్ వంటి ఇతర కార్యక్రమాలు ఉపాధిని కల్పించడంలో సహాయపడే ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్లను కూడా కేంద్రం ప్రవేశపెడుతోందని పేర్కొన్నారు.