ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ లో నీరజ్ చోప్రాకు గోల్డ్.. ప్రధాని, ఇండియన్ ఆర్మీ అభినందనలు..
బుడాపెస్ట్ లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో గోల్డ్ మెడల్ సాధించిన నీరజ్ చోప్రాకు దేశ వ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ ఆయనను ట్విట్టర్ లో అభినందించారు. ఇండియన్ ఆర్మీ కూడా ప్రశంసించింది.
హంగేరీలోని బుడాపెస్ట్ లో జరిగిన ప్రతిష్టాత్మక ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో భారత్ కు తొలి స్వర్ణం సాధించిపెట్టిన నీరజ్ చోప్రాను ప్రధాని నరేంద్ర మోడీ అభినందించారు. అలాగే ఇండియన్ ఆర్మీ కూడా ఆయనను ప్రశంసించింది. ప్రతిభావంతుడైన నీరజ్ చోప్రా శ్రేష్టతకు నిదర్శమని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. ‘‘అతడి అంకితభావం, ఖచ్చితత్వం, అభిరుచి అతన్ని అథ్లెటిక్స్ లో ఛాంపియన్ గా మాత్రమే కాకుండా మొత్తం క్రీడా ప్రపంచంలో అసమానమైన ప్రతిభకు చిహ్నంగా చేసింది. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో స్వర్ణం సాధించినందుకు ఆయనకు అభినందనలు’’ అని పేర్కొన్నారు.
నీరజ్ చోప్రా సాధించిన ప్రత్యేక, స్మారక విజయాన్ని ఇండియన్ ఆర్మీ ప్రశంసించింది. ‘‘నీరజ్ చోప్రా మమ్మల్ని మళ్లీ గర్వపడేలా చేశాడు!! బుడాపెస్టోలో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2023లో పురుషుల జావెలిన్లో 88.17 మీటర్లు విసిరి స్వర్ణ పతకం సాధించిన సుబేదార్ నీరజ్ చోప్రాను భారత సైన్యం అభినందిస్తోంది’’ అని ఇండియన్ ఆర్మీ ట్వీట్ చేసింది.
కాగా.. స్వర్ణం గెలిచిన అనంతరం నీరజ్ మాట్లాడుతూ భారత ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ‘‘ఈ పతకం యావత్ భారతదేశానికి దక్కుతుంది. నేను ఒలింపిక్ ఛాంపియన్ ని, నేను ప్రపంచ ఛాంపియన్ ని. వివిధ రంగాలలో కష్టపడి పని చేయండి. మనం ప్రపంచంలో పేరు తెచ్చుకోవాలి. ’’ అని పేర్కొన్నారు.