వందేళ్ల క్రితం చోరీ.. ఇన్నేళ్లకు భారత్కి చేరిన అన్నపూర్ణా దేవి విగ్రహం, కాశీలో పున: ప్రతిష్టకు ఏర్పాట్లు
ప్రముఖ పుణ్యక్షేత్రం వారణాసి (varanasi) నుంచి దొంగిలించబడిన మహిమాన్వితమైన అన్నపూర్ణా దేవి విగ్రహాన్ని కెనడా (canada) నుంచి భారత ప్రభుత్వం (govt of india) తిరిగి తీసుకువచ్చింది. దాదాపు 100 సంవత్సరాల క్రితం దొంగిలించబడినట్లు అధికారులు చెబుతున్నారు
దశాబ్దాల క్రితం భారతదేశం నుంచి చోరీకి గురైన దేవతా మూర్తుల విగ్రహాలను, కళాఖండాలను నరేంద్ర మోడీ (narendra modi) ప్రభుత్వం తిరిగి స్వదేశానికి తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా.. ప్రముఖ పుణ్యక్షేత్రం వారణాసి (varanasi) నుంచి దొంగిలించబడిన మహిమాన్వితమైన అన్నపూర్ణా దేవి విగ్రహాన్ని కెనడా (canada) నుంచి భారత ప్రభుత్వం (govt of india) తిరిగి తీసుకువచ్చింది. ఈ అరుదైన విగ్రహం దాదాపు 100 సంవత్సరాల క్రితం దొంగిలించబడినట్లు అధికారులు చెబుతున్నారు. కెనడా నుంచి అన్నపూర్ణ దేవి విగ్రహం (annapurna devi) స్వదేశానికి చేరుకున్న అనంతరం పూజలు నిర్వహించారు. దీనిలో భాగంగా ఢిల్లీలోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్లో కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి (kishan reddy) అన్నపూర్ణా దేవి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు కేంద్రమంత్రులు, అధికారులు పాల్గొన్నారు.
భారతదేశ నాగరికత, సాంస్కృతిక వైభవాన్ని గౌరవించే రోజంటూ కిషన్ రెడ్డి ట్వీట్ చేశారు. అన్నపూర్ణా దేవి విగ్రహాన్ని ఊరేగింపుగా యూపీలోని కాశీ విశ్వనాథ ఆలయానికి తీసుకువెళ్లి అక్కడ పున:ప్రతిష్ట నిర్వహించనున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. కాశీ విశ్వనాథుని ఆలయంలో భక్తులు ఇకనుంచి అన్నపూర్ణ దేవి కృపను, ఆశీర్వచనాన్ని కూడా పొందవచ్చని ఆయన అన్నారు. గతంలో ఎవ్వరూ చేయలేని విధంగా ఎన్డీఏ ప్రభుత్వం చారిత్రాత్మక విగ్రహాలను స్వదేశానికి తీసుకొస్తుందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.