ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు తప్పకుండా నెరవేరుస్తామని చెబుతూ గోవాలో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన అభ్యర్థులు బాండ్ పేపర్ పై సంతకాలు పెట్టారు. ఎన్నికల్లో గెలిచిన తరువాత పార్టీ మారబోమని ప్రమాణం చేశారు.
Goa Election News 2022 : గోవా (goa) ఎన్నికలు సమీపంలోనే ఉన్నాయి. దీంతో అన్ని పార్టీలు గెలుపు కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రజలకు హామీలు గుప్పిస్తున్నాయి. తాము గెలిస్తే ఇది చేస్తాం, అది చేస్తాం అంటూ వరాల జల్లు కురపించేస్తున్నాయి. ప్రచారంలో భాగంగా అన్ని పార్టీలు ఇదే తీరుగా వ్యహరిస్తున్నాయి. అయితే ప్రచారం విషయంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఓ అడుగు ముందుకేసింది. తమ పార్టీ గోవాలో అధికారంలోకి వస్తే తప్పకుండా హామీలు నేరవేరుస్తామని చెప్పి బాండ్ పేపర్ (bond paper)పై సంతకాలు పెట్టారు.
గోవాలో ఎన్నికల నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులు బుధవారం లీగల్ అఫిడవిట్ (legal affidavit)పై సంతకాలు చేశారు. హామీలన్నీ నెరవేరుస్తామని చెప్పారు. అలాగే పార్టీకి విధేయుడిగా ఉంటామంటూ ప్రమాణం చేశారు. రాబోయే ఎన్నికల్లో తాము గెలిస్తే నిజాయితీగా పనిచేస్తామని అభ్యర్థులు ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (delhi cm arvind kejriwal) మీడియాతో మాట్లాడారు. తమ పార్టీ అభ్యర్థులందరూ నిజాయితీపరులే అని అన్నారు. అయినప్పటికీ గోవా రాష్ట్ర ప్రజలకు భరోసా ఇవ్వడానికి ఈ అఫిడవిట్పై సంతకం చేయించి ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. ‘‘ మా అభ్యర్థులందరూ నిజాయితీపరులు, అయితే ఈ అభ్యర్థులు నిజాయితీపరులు అని ఓటర్లకు భరోసా ఇవ్వడానికి ఈ అఫిడవిట్ అవసరం’’ అని స్పష్టం చేశారు.
ఈ అఫిడవిట్ల కాపీలను ఓటర్లకు అందుబాటులో ఉంచుతామని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. విశ్వాసాన్ని ఉల్లంఘిస్తే వారిపై తర్వాత కేసు ఓటర్లు నమోదు చేయవచ్చని ఆయన తెలిపారు. “ మా అభ్యర్థులు తమ నియోజకవర్గంలోని ప్రతీ ఇంటికి సంతకం చేసిన అఫిడవిట్ జిరాక్స్ కాపీ (xerox copies) లను పంపుతారు. ఇలా చేయడం వల్ల మా అభ్యర్థులు అఫిడవిట్లోని నిబంధనలను ఉల్లంఘిస్తే వారిపై విశ్వాస ఉల్లంఘన కేసును నమోదు చేసే హక్కును మేము ఓటర్లకు ఇస్తున్నాము” అని అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు.
విమానాశ్రయంలో కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడారు. ‘‘ గోవాకు ఈ అసెంబ్లీ ఎన్నికలు చాలా కీలకం. గోవా ప్రజలు తమకు ఏది మంచిదో నిర్ణయించుకోవాలి. అవినీతి రహిత ప్రభుత్వాన్ని వాగ్దానం చేసిన ఆప్కి మద్దతు ఇవ్వడం ఒక ఎంపిక. లేదా బీజేపీ (bjp)కి నేరుగా మద్దతు ఇవ్వడం మరొక ఎంపిక. గత ఎన్నికల్లో గోవా ప్రజలు బీజేపీ ప్రభుత్వంతో విసిగిపోయి కాంగ్రెస్ (congress)ను ఎంచుకున్నారు. కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రజలను నిరాశపరిచారు.’’ బీజేపీ ఎలాగైనా అధికారంలోకి రావాలని చూస్తోందని అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. ‘‘ బీజేపీ కొత్త వ్యూహం రచించింది. కాంగ్రెస్ అభ్యర్థులు తమ స్థానాల్లో గెలుపొందగానే, వారు బీజేపీలో చేరబోతున్నారు’’ అని ఆయన జోష్యం చెప్పారు.
గోవాలో 2017 ఎన్నికల్లో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయినప్పటికీ ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో విఫలమైంది. బీజేపీ అధికారం చేపట్టింది. తరువాత కాలంలో కాంగ్రెస్ నుంచి గెలిచిన చాలా మంది ఎమ్మెల్యేలు బీజేపీలోకి జంప్ అయ్యారు.
