Mamata Banerjee: దమ్ముంటే వారణాసిలో మోడీని ఓడించండి: కాంగ్రెస్కు మమతా బెనర్జీ సవాల్
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ 300 స్థానాల్లో పోటీ చేస్తే 40 సీట్లు అయినా గెలుచుకుంటుందా? అనేది అనుమానమే అని అన్నారు. అంతేకాదు, దమ్ముంటే వారణాసి నుంచి పోటీ చేయాలని సవాల్ విసిరారు.
![go and contest from varanasi against pm narendra modi west bengal cm mamata banerjee dares congress party kms go and contest from varanasi against pm narendra modi west bengal cm mamata banerjee dares congress party kms](https://static-ai.asianetnews.com/images/01hfy5b36wkr6k97bzxg7mc23w/mixcollage-23-nov-2023-06-48-pm-1089_363x203xt.jpg)
INDIA Alliance: పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. లోక్ సభ ఎన్నికల్లో ఆ పార్టీ కనీసం 40 సీట్లు కూడా గెలుస్తుందా? లేదా? అనేది తన అనుమానం అని అన్నారు. బెంగాల్లోని ముర్షిదాబాద్లో నిర్వహించిన ఓ నిరసన కార్యక్రమంలో ఆమె విలేకరులతో మాట్లాడారు.
‘కాంగ్రెస్ పార్టీ 300 సీట్లల్లో పోటీ చేస్తే కనీసం 40 సీట్లు గెలుస్తుందా? అన్నది అనుమానమే. అలాంటప్పుడు ఎందుకు అంత అహంకారం? మీరు బెంగాల్కు వచ్చారు. మనం ఇండియా కూటమిలో మిత్రపక్షాలం. బెంగాల్కు వచ్చినప్పుడు కనీసం నాకు సమాచారం ఇవ్వాలి కదా. అధికారుల నుంచి నాకు ఆ విషయం తెలిసింది. మీకు నిజంగా దమ్ముంటే బీజేపీని వారణాసి స్థానంలో ఓడించండి. గతంలో మీరు గెలిచిన స్థానాల్లో ఓడిపోయారు’ అని మమతా బెనర్జీ అన్నారు.
‘ఉత్తరప్రదేశ్లో ఓడిపోయారు. రాజస్తాన్లో ఓడిపోయారు. అక్కడ మీరు పోటీ చేసి గెలవండి. మీరు ఎంత ధైర్యవంతులో నేను చూస్తాను. అలహాబాద్లో, వారణాసిలో పోటీ చేసి గెలవండి. మీ పార్టీ ఎంత సాహసం చేయగలదో చూస్తాను’ అని మమతా బెనర్జీ మండిపడ్డారు.
Also Read : INDIA Alliance: ఇండియా కూటమి అసెంబ్లీ ఎన్నికలకు కాదు.. లోక్ సభ ఎన్నికలకే: కాంగ్రెస్
వారణాసి లోక్ సభ స్థానానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. రెండు సార్లు ఆయన అక్కడి నుంచే పోటీ చేసి గెలిచారు. 2014లో మోడీ అక్కడి నుంచి నామినేషన్ వేసినప్పుడు ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ కూడా ఆయనపై పోటీ చేశారు. కానీ, అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోయారు.
‘కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా బీజేపీపై నేరుగా 300 స్థానాల్లో పోటీ చేయాలని నేను ప్రతిపాదించాను. కానీ, వారు తిరస్కరించారు. నేను వారితో కూటమికి అంగీకరించాను. బెంగాల్లో రెండు స్థానాలను ఆఫర్ చేశాం. కానీ, వారే తిరస్కరించారు. ఇప్పుడు రాష్ట్రంలోని 42 ఎంపీ స్థానాల్లో ఒంటరిగా పోటీ చేయనివ్వండి. అప్పటి నుంచి మా పార్టీల మధ్య ఎలాంటి సంప్రదింపులు లేవు. పొత్తు వద్దనుకున్నది వాళ్లే.. ’ అని మమతా బెనర్జీ అన్నారు.