ఎయిమ్స్ లో చేరిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్
మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ దిల్లీ ఎయిమ్స్ లో చేరారు. ఛాతీ నొప్పి రావడంతో ఆయనను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం హృదయ చికిత్స విభాగంలో వైద్యుల పరిశీలనలో ఉన్నారు.
మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ దిల్లీ ఎయిమ్స్ లో చేరారు. ఛాతీ నొప్పి రావడంతో ఆయనను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం హృదయ చికిత్స విభాగంలో వైద్యుల పరిశీలనలో ఉన్నారు.
రాత్రి 8.45 ప్రాంతంలో ఆయనను ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఆయన పరిస్థితికేమి ఢోకా లేదని, కేవలం సాధారణ వార్డులోనే చికిత్స పొందుతున్నారని, ఐసీయూలో కాదని ఆసుపత్రివర్గాలు తెలిపాయి.
ఇకపోతే ఆయన గతంలో దేశ ఆర్థికపరిస్థితిపై స్పందించారు. ప్రతి ఆర్థిక సంక్షోభానికి యూపీఏ ప్రభుత్వాన్ని నిందించడం ప్రస్తుత మోదీ సర్కార్కు ఓ అలవాటై పోయిందని మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ మండిపడ్డారు. కేంద్రంలో నరేంద్రమోదీ సర్కార్ అధికారంలోకి వచ్చిన ఐదున్నరేళ్ల తర్వాత కూడా తమ ప్రభుత్వంపై విమర్శలు చేయడమేమిటని నిలదీశారు. ప్రధానిగా మన్మోహన్, ఆర్బీఐ గవర్నర్గా రఘురాం రాజన్ ఉన్న సమయంలోనే ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం అమెరికాలో వ్యాఖ్యానించారు. దేశంలో బ్యాంకింగ్ రంగ సంక్షోభానికి కారణం ఈ ఇరువురేనని ఆరోపించిన సంగతి విదితమే.
మీడియాతో మాట్లాడుతూ ‘మా పాలనలో జరిగిన తప్పుల నుంచి మోదీ సర్కారు గుణపాఠాలు నేర్చుకుంటే బాగుండేది. ఇప్పుడు ఉన్న సమస్యలకు చక్కని పరిష్కారాలు దొరికేవి. నీరవ్ మోదీ, ఇతర రుణ ఎగవేతదారులు విదేశాలకు పారిపోయి ఉండేవారు కాదు. బ్యాంకుల పరిస్థితి మరింత దిగజారేది కాదు’ అని చురకలంటించారు.
గత ప్రభుత్వ లోపాలను సరిదిద్దడానికి ఐదున్నరేండ్లు చాల్లేదా?.. అని మన్మోహన్ సింగ్ ఈ సందర్భంగా ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిని నిలదీశారు. ‘పదేళ్ల పాలనలో మేం అన్నీ తప్పులనే చేస్తే.. ఈ ఐదున్నరేళ్లలో మీరేం వెలగబెట్టారు’ అని ప్రశ్నించారు. ప్రజలకు చక్కని పాలనను అందించడానికి కావాల్సినంత సమయం ఈ ప్రభుత్వానికి లభించిందని, అయినా ఆ పని చేయకుండా.. గత ప్రభుత్వాలపై ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా ఈ చౌకబారు ఆరోపణల్ని ఆపేసి, పాలనాపరమైన అంశాలపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. ఇంకా ఐదేళ్ల సమయం ఉన్న క్రమంలో లోపాలను గుర్తించి, దేశ ఆర్థిక వ్యవస్థను మెరుగుపర్చడంపై దృష్టి సారించాలి' అని సూచించారు.