ముగ్గురు మాజీ సీఎంల గృహ నిర్బంధం.. ఆందోళనలను అడ్డుకోవడానికి బలగాల చర్యలు
జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు ముగ్గురిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. కశ్మీర్లో నియోజకవర్గాల పునర్విభజనపై డీలిమిటేషన్ కమిషన్ రూపొందించిన డ్రాఫ్ట్ను జమ్ము కశ్మీర్ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జనవరి 1వ తేదీన జమ్ము కశ్మీర్ పార్టీలు ధర్నాకు పిలుపునిచ్చాయి. కానీ, ఈ పిలుపును అడ్డుకుంటూ పోలీసులు రంగంలోకి దిగారు. ముగ్గురు మాజీ సీఎంలను హౌజ్ అరెస్టు చేశారు.
శ్రీనగర్: నూతన సంవత్సర తొలి రోజే కశ్మీర్(Jammu Kashmir)లో ఆంక్షలు మరోసారి కనిపించాయి. అసెంబ్లీ సీట్ల(Assembly Seats) ముసాయిదాకు వ్యతిరేకంగా తలపెట్టిన ఆందోళనను అడ్డుకోవడానికి భద్రతా బలగాలు.. జమ్ము కశ్మీర్ ముగ్గురు ముఖ్యమంత్రుల(Former Chief Minister)ను హౌజ్ అరెస్టు(House Arrest) చేశారు. డీలిమిటేషన్ కమిషన్ నిర్ణయానికి వ్యతిరేకంగా వీరు ప్రదర్శనలకు పిలుపు ఇచ్చారు. కానీ, ఆ నిరసనలను అడ్డుకోవడానికి పోలీసులు మాజీ సీఎంల నివాసాల దగ్గర భారీగా మోహరించారు. మాజీ సీఎం ఫరూఖ్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, పీడీపీ నేత, మాజీ సీఎం మెహబూబా ముఫ్తీలు నివాసం ఉండే హై సెక్యూరిటీ జోన్ ఏరియా.. శ్రీనగర్రలోని గుప్కార్ రోడ్డు వద్ద బలగాలు భారీగా మోహరించాయి. ఆ రోడ్డు మొత్తం సీల్ చేశాయి. ఈ ముగ్గురు నేతల నివాసాల ఎదుట బలగాలు చేరాయి. ఆ నివాసం నుంచి బయటకు.. బయటి నుంచి ఆ నివాసంలోకి ఎవరినీ వెళ్లనివ్వడం లేదు.
జమ్ము కశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా... తన ఇల్లు, తన తండ్రి నివాసాల ఫొటోలను ట్వీట్ చేశారు. ఆయన సోదరిలను లాక్ చేసి సెక్యూరిటీ ట్రక్కులు వారి నివాసాల ఎదుట నిలిపి ఉన్న దృశ్యాలను ఆయన సోషల్ మీడియాలో పోస్టు చేశారు. 2022 ఏడాదికి స్వాగతం పలుకుతూ.. ఆయన జమ్ము కశ్మీర్లో అక్రమంగా ప్రజలను గృహ నిర్బంధం చేస్తున్న విధం ఎప్పటిలాగే సాధారణం అయిపోతున్దని పేర్కొన్నారు. శాంతియుతంగా ధర్నా చేస్తామన్న తమ పిలుపునూ ఈ బలగాలు అడ్డుకుంటున్నాయని తెలిపారు.
జమ్ము కశ్మీర్ ప్రత్యేక హోదాను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ కార్యకర్తలు ఆందోళనలు చేశారు. పలుచోట్ల ప్రదర్శనలు చేశారు. కాగా, డీలిమిటేషన్ ప్రక్రియను వ్యతిరేకిస్తున్న నేతలను గృహ నిర్బంధం చేయడాన్ని నిరసించారు. వారు గుప్కార్ రోడ్డు వైపు మార్చ్ చేపట్టడానికి ప్రయత్నించారు. కానీ, పోలీసులు వారిని అడ్డుకున్నారు.
జమ్ము కశ్మీర్ నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన ఒక డ్రాఫ్ట్ రిపోర్టు ఇప్పుడు చర్చనీయ అంశమైంది. కొత్తగా జమ్ముకు ఆరు, కశ్మీర్ ఒక్క నియోజకవర్గాలను అధికంగా కేటాయించాలనే ప్రతిపాదన ఇప్పుడు దుమారం రేపింది. జమ్ము కశ్మీర రాష్ట్రంగా ఉన్నప్పుడు జమ్ము ప్రావిన్స్ నుంచి 37 సీట్లు, కశ్మీర్ ప్రావిన్స్ నుంచి 46 సీట్లు, లడాఖ్ నుంచి నాలుగు సీట్లు ఉండేవి. తాజాగా వెలుగులోకి వచ్చిన డ్రాఫ్ట్తో ఈ సంఖ్య జమ్ములో 43 సీట్లకు పెరగ్గా.. కశ్మీర్లో సీట్ల సంఖ్య 47కు చేరుకుంటుంది. జనాభా ప్రకారం కూడా ఓ పరిశీలన చేయవచ్చు. 2011 జనాభా లెక్కల ప్రకారం, జమ్ము కంటే కశ్మీర్లోనే సుమారు 15 లక్షల జనాభా ఎక్కువగా ఉన్నది. జమ్ములో 53.5 లక్షల జనాభా ఉండగా, కశ్మీర్లో 68.8 లక్షల జనాభా ఉన్నది. తాజా డ్రాఫ్ట్ వివరాలను జనాభా లెక్కన సీట్లను గణిస్తే.. కశ్మీర్లో 1.46 లక్షల మందికి ఒక సీటు ఉండగా, జమ్ములో 1.25 లక్షల మందికే ఒక సీటు కేటాయించినట్టు అవుతుంది. ఈ నేపథ్యంలోనే జమ్ము కశ్మీర్ పార్టీలు తాజా డ్రాఫ్ట్పై తీవ్ర అసహనంతో ఉన్నాయి.