ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సీబీఐ మంగళవారం సప్లిమెంటరీ చార్జిషీట్ వేసింది. ఈ చార్జిషీటులో తొలిసారి ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా పేరును ప్రస్తావించింది. ఆయనతోపాటు బుచ్చి బాబు, అర్జున్ పాండే, అమన్‌దీప్ దల్‌ల పేర్లనూ పేర్కొంది.  

న్యూఢిల్లీ: లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా పేరు తొలిసారిగా సీబీఐ చార్జిషీట్‌లో నమోదైంది. మంగళవారం సీబీఐ ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సప్లిమెంటరీ చార్జిషీటు దాఖలు చేసింది. ఇందులో బీఆర్ఎస్ లీడర్ కల్వకుంట్ల కవిత మాజీ ఆడిటర్ బుచ్చి బాబు, అర్జున్ పాండే, అమన్‌దీప్ దల్‌ల పేర్లనూ సీబీఐ పేర్కొంది. ఈ కేసులో ఇతర నిందితుల పాత్రపైనా దర్యాప్తు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

గతవారం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఈ కేసులో సాక్షిగా సీబీఐ తొమ్మిది గంటలపాటు విచారించింది. బీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవితను కూడా ఈ కేసులో విచారణ ఎదుర్కొన్నారు. 

ఈ కేసు ఫాల్స్ అని, తమ పార్టీ ఆప్ జాతీయ పార్టీ అయినందునే తమను కేంద్ర ప్రభుత్వం టార్గెట్ చేసి ఇలా వేధిస్తున్నదని కేజ్రీవాల్ అన్నారు. తమ అభివృద్ధి పనులను అడ్డుకోవాలని, తమ కీర్తిని అగౌరవపరచాలనే ఉద్దేశంతోనూ ఈ కుట్రపూరిత చర్యలు చేపడుతున్నదని ఆరోపించారు.

Also Read: పరువు నష్టం కేసులో గుజరాత్ హైకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ

తాను ఏ తప్పూ చేయలేదని మనీష్ సిసోడియా కూడా పేర్కొన్నారు. తనకు వ్యతిరేకంగా ఏ ఆధారమూ లేదని బెయిల్ పిటిషన్ విచారణలో మనీష్ సిసోడియా అన్నారు.

ఈ కేసులో మొత్తం 10 మందిని అరెస్టు చేశారు. ఒక్క మనీష్ సిసోడియా మినహా మిగిలిన వారంతా బెయిల్ పై బయటే ఉన్నారు.