గుజరాత్లోని మోర్బీలో కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనలో 141 మంది జల సమాధి అయిన ఘటన భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు ప్రధాని నరేంద్ర మోడీ మోర్బీలో పర్యటించనున్నారు. అయితే అధికారుల తీరుపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.
గుజరాత్లోని మోర్బీలో కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనలో 141 మంది జల సమాధి అయిన ఘటన భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిన సంగతి తెలిసిందే. దీనికి పలు దేశాల అధినేతలు కూడా సంతాపం తెలిపారు. ఇప్పటికే మోర్చీలో తీగల వంతెన ఘటనకు బాధ్యులైన వారిపై కేసులు నమోదు చేసిన పోలీసులు.. మరిన్ని ఆధారాలను సేకరిస్తున్నారు. ఇప్పటికే తీగల వంతెన పనులను మసి పూసి మారేడు కాయ చేసినట్లుగా చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ప్రధాని పర్యటనలో అదే రకంగా వ్యవహరించి విమర్శల పాలయ్యారు.
ఏం జరిగిందంటే .. మోర్చీ ఘటనపై ఇప్పటికే సంతాపం తెలిపిన ప్రధాని నరేంద్రమోడీ.. బాధితులను పరామర్శించేందుకు మంగళవారం గుజరాత్ రానున్నారు. ఈ సందర్భంగా ప్రమాద స్థలిని పరిశీలించి, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శిస్తారు. ప్రధాని రాక నేపథ్యంలో మోర్బీ అధికారులు ఆగమేఘాల మీద ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పేరుకున్న సమస్యలపై దృష్టిపెట్టారు. దీనిలో భాగంగా రాత్రికి రాత్రే ఆసుపత్రి గోడలకు రంగులు వేయించడంతో పాటు కొన్ని రిపేర్లు చేయించారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక మీడియా ప్రతినిధులు అక్కడికి చేరుకుని ఈ తతంగాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఈ వీడియోలు కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఈ వ్యవహారంపై విపక్షాలు మండిపడుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీతో ఫోటో షూట్ కోసం బీజేపీ ఏర్పాట్లు చేస్తోందని కాంగ్రెస్, ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇంతటి విషాదం జరిగితే బీజేపీ నేతలు మాత్రం ప్రధాని ఏర్పాట్లలో బిజీగా వున్నారంటూ మండిపడ్డారు కాంగ్రెస్ నేతలు. ప్రభుత్వ ఆసుపత్రిలో సౌకర్యాలు బాగున్నాయని, ప్రధాని భావించేలా బీజేపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.
ALso Read:మోర్బీ వంతెన ప్రమాదంపై జ్యుడీషియల్ విచారణకు కాంగ్రెస్ డిమాండ్
మరోవైపు.. బ్రిడ్జి కూలిన ఘటనపై జ్యుడీషియల్ విచారణ జరిపించాలని కాంగ్రెస్ సోమవారం డిమాండ్ చేసింది. ప్రాథమికంగా చూస్తే ఇది నేరపూరిత నిర్లక్ష్యం, స్థూల పాలనా లోపంగా కనిపిస్తోందని ఆరోపించింది. అలాగే, బాధితులందరికీ ప్రభుత్వం నుండి ఆర్థిక, వైద్య సహాయం అందించాలని డిమాండ్ చేసింది. గుజరాత్ లో బ్రిటిష్ కాలం నాటి వంతెన పునరుద్ధరించిన వారం రోజులకే కూలిపోవడంతో 14ం మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అహ్మదాబాద్కు 200 కిలో మీటర్ల దూరంలో ఉన్న సస్పెన్షన్ బ్రిడ్జ్ ఆదివారం సాయంత్రం 6.42 గంటలకు కుప్పకూలింది. ఛత్ పూజకు సంబంధించి కొన్ని ఆచారాలు నిర్వహించడానికి సుమారు 500 మంది దానిపై గుమిగూడారు. ఈ వంతెనకు చాలా కాలంపాటు విస్తృతమైన మరమ్మతులు, పునరుద్ధరణ తర్వాత ఐదు రోజుల క్రితం ఈ వంతెనను తెరిచారు.
ఆదివారం నాడు జనంతో కిక్కిరిసిపోయిన క్రమంలో వంతెన కూలిపోయింది. ఇంకా చాలా మంది కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ దుర్ఘటనలో మృతి చెందిన వారికి నివాళులు అర్పించిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే .. తమ ఆత్మీయులను కోల్పోయిన వారి కుటుంబాలకు ఆ బాధను భరించే శక్తిని భగవంతుడు ప్రసాదించాని కోరారు. మీడియా ఖర్గే మాట్లాడుతూ.. ఐదు రోజుల క్రితం మళ్లీ తెరిచిన వంతెన కూలిపోవడానికి గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు. ఇంత మందిని ఎందుకు అనుమతించారు? అని ప్రశ్నించారు. రిటైర్డ్ సుప్రీంకోర్టు లేదా హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో ఈ ఘటనపై విచారణ జరగాలని ఖర్గే అన్నారు.
