Himachal rainfall: భారీ వర్షాల కారణంగా హిమాచల్ ప్రదేశ్ లోని భాక్రా-నంగల్ డ్యామ్ వద్ద నీటి ప్రవాహం భారీగా పెరిగింది. మండి జిల్లాలో బియాస్ నదిపై భారీ కొండచరియలు విరిగిపడటంతో వంతెనలో కొంత భాగం కొట్టుకుపోయింది. హైవేపై పలు వాహనాలు నిలిచిపోవడంతో మండీ-కులు మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాల కారణంగా కసోల్ వెంబడి ప్రవహించే గ్రహణ్ కాలువలో అకస్మాత్తుగా నీరు పెరగడంతో కసోల్ మార్కెట్ వెంబడి నిలిపి ఉంచిన వాహనాలు దెబ్బతిన్నాయి. జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.

Himachal breaks 50-year rainfall record: హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం రుతుపవనాల ఉధృతితో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు సోమవారం ఉదయం ఒక వీడియో సందేశంలో రాబోయే 24 గంటలు ప్రజలు ఇళ్లలోనే ఉండాలని కోరారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదలు, ఇతర నష్టాల నేపథ్యంలో 1100, 1070, 1077 హెల్ప్ లైన్ నంబర్లను సీఎం విడుదల చేశారు. మండి జిల్లాలోని పండోహ్ వద్ద భారీ వర్షాల కారణంగా బియాస్ నది నీటిమట్టం పెరగడంతో ముంపునకు గురైన ఇళ్ల నుంచి ఆరుగురిని రక్షించారు. రాష్ట్రంలో ప్ర‌స్తుతం కురుస్తున్న వాన‌లు గ‌త 50 ఏండ్ల రికార్డును బ్రేక్ చేశాయ‌ని రిపోర్టులు పేర్కొంటున్నాయి.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

''భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రాష్ట్ర ప్రజలందరూ 24 గంటల పాటు ఇళ్లలోనే ఉండండి. 1100, 1070, 1077 అనే మూడు హెల్ప్ లైన్లను ప్రారంభించాం. విపత్తులో చిక్కుకున్న వారి గురించి సమాచారం పంచుకోవడానికి మీరు ఈ నంబర్లకు కాల్ చేయవచ్చు. మీకు సహాయం చేయడానికి నేను 24 గంటలూ అందుబాటులో ఉంటాను'' అంటూ ముఖ్య‌మంత్రి పేర్కొన్నారు. శాసనసభ్యులందరూ తమ నియోజకవర్గాల్లో మకాం వేసి అవసరమైన వారందరినీ ఆదుకోవాలని ఆయన కోరారు. ఈ విపత్కర సమయంలో ప్రజలను ఆదుకోవాలనీ, వారి నష్టాన్ని భర్తీ చేసేలా చూడాలన్నారు. ''వ‌ర‌ద‌ల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ విపత్తులో ఇప్పటివరకు 14 మంది మరణించారు'' అని సీఎం సుఖు తెలిపారు.

రానున్న 48 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఆదివారం రెడ్ అలర్ట్ ప్రకటించింది. వర్షాల వల్ల వరదలు, కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. హిమాచల్ ప్రదేశ్ లోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ సోమవారం తెలిపింది. బిలాస్పూర్, సోలన్, సిమ్లా, సిర్మౌర్, ఉనా, హమీర్పూర్, మండి, కులు జిల్లాల్లో ఉరుములతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పలు వంతెనలు, రహదారులు కూలి కొట్టుకుపోయిన దృశ్యాలను ప్రజలు సామాజిక మాధ్యమాల్లో వైర‌ల్ అవుతున్నాయి. మండి జిల్లాలోని ఔట్ ను లార్జీతో కలిపే 50 ఏళ్ల నాటి వంతెన సైంజ్, బంజర్ పక్కన కొట్టుకుపోయింది. కొన్ని గంటల తర్వాత నది నీటిమట్టం పెరగడంతో చారిత్రక పంచవక్త్ర వంతెన కూడా కొట్టుకుపోయింది.

భారీ వర్షాల కారణంగా హిమాచల్ ప్రదేశ్ లోని భాక్రా-నంగల్ డ్యామ్ వద్ద నీటి ప్రవాహం భారీగా పెరిగింది. మండి జిల్లాలో బియాస్ నదిపై భారీ కొండచరియలు విరిగిపడటంతో వంతెనలో కొంత భాగం కొట్టుకుపోయింది. హైవేపై పలు వాహనాలు నిలిచిపోవడంతో మండీ- కులు మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాల కారణంగా కసోల్ వెంబడి ప్రవహించే గ్రహణ్ కాలువలో అకస్మాత్తుగా నీరు పెరగడంతో కసోల్ మార్కెట్ వెంబడి నిలిపి ఉంచిన వాహనాలు దెబ్బతిన్నాయి. జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.