‘ముందు జైలు కూడు తిను.. ఆ తర్వాత చూద్దాం’.. మాజీ హోం మంత్రి విజ్ఞప్తిపై న్యాయస్థానం
మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్ దేశ్ముఖ్ చేసిన విజ్ఞప్తులను కోర్టు తోసిపుచ్చింది. జైలులో తనకు ఇంటి ఆహారం తినడానికి అనుమతించాలని కోరగా, ముందు జైలు కూడు తినాలని తెలిపింది. ఆ తర్వాత ఏమైనా సమస్యలు వస్తే చూద్దామని వివరించింది. ఆయన ఆరోగ్యం బాగా లేనందున జైలులో పడక వసతికి అనుమతించింది.
ముంబయి: అవినీతి కేసులో మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్ దేశ్ముఖ్ను ప్రత్యేక న్యాయస్థానం 14 రోజుల జ్యూడిషియల్ కస్టడీకి పంపింది. ఇదే విచారణలో ఆయన చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చింది. తనకు ఇంటి వద్ద నుంచి ఆహారాన్ని పొందడానికి అనుమతించాలని ఆయన కోర్టుకు విజ్ఞప్తి చేసింది. కానీ, కోర్టు ఈ విజ్ఞప్తిని తోసిపుచ్చింది. ముందు జైలు ఫుడ్ తినాలని సూచించింది. ఒకవేళ దానితోని సమస్య ఉత్పన్నమైతే అప్పుడు ఈ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుంటామని తెలిపింది. అయితే, ఆయన ఆరోగ్య స్థితిని దృష్టిలో పెట్టుకుని జైలులో బెడ్ ఏర్పాటు చేయడానికి అనుమతించింది.
మనీలాండరింగ్ కేసులో ఈ నెల 2వ తేదీన మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్ దేశ్ముఖ్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్టు చేశారు. ముంబయిలోని ఈడీ కార్యాలయంలో ఆయనను విచారించిన తర్వాత అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఏప్రిల్లో దేశ్ముఖ్పై సీబీఐ అవినీతి ఆరోపణలపై కేసు నమోదు చేసింది. ఆ తర్వాతే ఈడీ ఈ కేసును తీసుకుని దర్యాప్తు మొదలుపెట్టింది. మాజీ ముంబయి పోలీసు అధికారి పరంబీర్ సింగ్.. తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. మాజీ హోం మంత్రి అనిల్ దేశ్ముఖ్పై రూ. 100 కోట్ల అవినీతి ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణల తర్వాతే దేశ్ముఖ్పై కేసు నమోదైంది.
రాష్ట్ర హోం మంత్రిగా అనిల్ దేశ్ముఖ్ ఉన్నప్పుడు ఆయన తన పదవిని తప్పుగా ఉపయోగించారని ఈడీ కోర్టులో వాదించింది. రాష్ట్రంలోని బార్లు రెస్టారెంట్ల ద్వారా రూ. 4.7 కోట్ల వసూలు చేసినట్టు ఆరోపించింది. డిస్మిస్ అయిన పోలీసు అధికారి సచిన్ వాజే ద్వారా ఈ వసూళ్లు చేశాడని తెలిపింది. కాగా, తనపై చేసిన ఆరోపణలు అన్నింటిని దేశ్ముఖ్ కొట్టి పారేశారు. చెడు మార్గం పట్టాడన్న ఆరోపణలున్న ఓ పోలీసు అధికారి బూటకపు వాంగ్మూలం ఆధారంగా తనపై ఈ ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.
ముంబయి మాజీ సీపీ పరంబీర్ సింగ్ అప్పటి హోం మంత్రి అనిల్ దేశ్ముఖ్పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన రెస్టారెంట్లు, బార్ల నుంచి వసూళ్లు చేయమని ఆదేశించారని, నెలకు రూ. 100 కోట్ల వసూళ్లు చేయాలని ఆదేశించారని ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలు తీవ్ర దుమారం రేపడంతో ఆయన హోం మంత్రి పదవికి రాజీనామా చేశారు.