ఐటీ ఆఫీసులో భారీ అగ్నిప్రమాదం
మంటలను అదుపుచేసిన అగ్నిమాపక సిబ్బంది
ముంబయిలోని ఆదాయపన్ను శాఖ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కాగా.. ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపు చేశారు. కాగా.. ఈ అగ్నిప్రమాదంపై పలు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
పీఎన్బీ బ్యాంకులో భారీ కుంభకోణానికి పాల్పడిన నీరవ్ మోదీ కేసుకు సంబంధించిన రికార్డులన్నీ ఆ ప్రమాదంలో కాలిబూడిద అయిపోయాయని మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి. అయితే ఈ విషయంపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.
నీరవ్ మోదీ, మెహుల్ చౌక్సిల విచారణకు చెందిన రికార్డులన్నీ సురక్షితంగా ఉన్నాయని, అగ్నిప్రమాదం జరుగడానికి కాస్త ముందుగానే వాటిని వేరే ప్రాంతానికి తరలించినట్టు ఆదాయపు పన్ను శాఖ అధికారులు పేర్కొన్నారు.
ముంబైలోని ఆదాయపు పన్ను ఆఫీసుకు చెందిన సింధియా హౌజ్లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నీరవ్, మెహుల్ల విచారణకు సంబంధించిన రికార్డులన్నీ కాలిపోయినట్టు న్యూస్ రిపోర్టులు వచ్చాయి.
అయితే ఈ రిపోర్టులన్నీ పూర్తిగా అవాస్తవం, తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయంటూ సీబీడీటీ క్లారిటీ ఇచ్చింది. ఈ విచారణకు చెందిన డాక్యుమెంట్లను, రికార్డులను అంచనా కార్యక్రమంలో భాగంగా పలు భవంతుల్లో ఉన్న అసెస్మెంట్ విభాగాలకు పంపించినట్టు పేర్కొంది.
రికార్డులు, డాక్యుమెంట్లు కోల్పోయామంటూ వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమంటూ తెలిపింది. ప్రస్తుతం పీఎన్బీ బ్యాంకులో చోటు చేసుకున్న రూ.13,400 కోట్ల కుంభకోణంపై సీబీఐ, ఈడీతో పాటు ఐటీ డిపార్ట్మెంట్ కూడా విచారణ జరుపుతోంది.