చెన్నైలో ఘోరం.. పట్టపగలు, రోడ్డుపై ఫైన్సాన్స్ కంపెనీ నిర్వాకుడిని నరికి చంపిన దుండగులు..
చెన్నైలో దారుణం జరిగింది. ఓ ఫైన్సాన్స్ కంపెనీ నిర్వాహకుడిని నడిరోడ్డుపై ఓ ముఠా అడ్డగించి నరికి చంపింది. పట్ట పగలు ఓ ప్రధాన పట్టణంలో ఈ ఘటన చోటు చేసుకోవడం ఆందోళనకరం. అయితే మృతుడిపై 6 కేసులు పెండింగ్ లో ఉన్నాయి.
అతడో ఫైన్సాన్స్ కంపెనీ నిర్వాహకుడు. రోజు వారిగానే మధ్యాహ్నం సమయంలో తన ఆఫీసులో పని చేసే మరో వ్యక్తిని తీసుకొని ఇంటి నుంచి ఆఫీసుకు బయలు దేరారు. అయితే దారిలో కొందరు దుండగులు వారి బైక్ ను అడ్డగించారు. కొడవల్లో అతడిని దారుణంగా నరికి చంపారు. పోలీసులు వెంటనే హాస్పిటల్ కు తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో కలకలం రేపింది.
తమిళనాడు రాష్ట్రం చెన్నైలోని అమింజికరైలో బుధవారం పట్టపగలు బైక్పై వచ్చిన ఓ ముఠా 36 ఏళ్ల ఎస్ ఆర్ముగంను నరికి చంపింది. మృతుడు చెట్పేటకు చెందిన వ్యక్తి. ఆయన ఓ ఫైనాన్స్ కంపెనీ నిర్వహిస్తున్నాడు. మరో వ్యక్తి రమేష్తో కలిసి ఆయన ఇంటి నుంచి ఆఫీసుకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. “ మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో పుల్లా అవెన్యూ సమీపంలో రెండు బైక్లపై వచ్చిన నలుగురు వ్యక్తులు ఆరుముగమ్ను అడ్డగించారు. కొడవళ్లతో నరికి చంపారు. అయితే ఆ ముఠా బైక్ పై ఉన్న మరో వ్యక్తి రమేష్ను వదిలిపెట్టింది. అతడు బైక్ను తీసుకొని అక్కడి నుంచి తప్పించుకున్నాడు.” అని పోలీసులు తెలిపారు. ఈ ఘటన తరువాత ఆ ముఠా కూడా అక్కడి నుంచి పారిపోయిందని చెప్పారు.
కాగా.. ఎస్ ఆర్ముగంపై దాడి చేసిన తరువాత కొంత సమయం పాటు అతడు గాయాలతో తీవ్ర బాధను అనుభవించాడు. అతడు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న తీరు అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రుడిని కిల్పాక్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. అయినప్పటికీ ఆయన పరిస్థితి విషమించి మృతి చెందాడు. దీంతో పోలీసులు హత్య కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చేపట్టారు.
అయితే ఆర్ముగంపై ఇది వరకే హత్య, దాడి, మహిళ వేధింపులతో పాటు ఆరు వేర్వేరు కేసులు నమోదయ్యాయని, అవి ప్రస్తుతం పెండింగ్ లో ఉన్నాయని పోలీసులు తెలిపారు. ‘‘ ఓ మహిళను ఆమె భర్త ముందు అతడు కత్తితో బెదిరించి లైంగికంగా వేధించాడు. ఈ కేసులో అతడు సంవత్సరాల క్రితం అరెస్టయ్యాడు ’’ అని ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ఆర్ముగం వల్ల బాధపడిన ఎవరైనా ఈ హత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
కాగా.. తెలంగాణ రాజదాని హైదరాబాద్ లోనూ మూడు రోజుల కిందటే ఇలాంటి ఘటనే జరిగింది. రోడ్డుపై ఓ వ్యక్తిని కొందరు వ్యక్తులు నరికి చంపారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ పాతబస్తీ లోని చాంద్రాయణగుట్ట బండ్లగూడ షాహీన్ నగర్ కు చెందిన జహంగీర్ (23), మహ్మద్ అష్రఫ్ (37) ఇద్దరూ ఒకేచోట డీసీఎం డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. నాంపల్లిలోని బిస్మిల్లా చికెన్ సెంటర్ లో కోళ్ళను సరఫరా చేసే డీసీఎంను వీరు నడిపేవారు. ఇలా కోళ్ల సరఫరా ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఇద్దరూ పంచుకునేవారు. అయితే డబ్బులు పంపకం విషయంలో ఇద్దరి మధ్యా తేడాలు వచ్చాయి.
ఈ క్రమంలో వారి మధ్య విభేదాలు వచ్చి మాటామాటా పెరిగి గొడవకు దారితీసింది. ఈ క్రమంలో కోపంలో తనను మోసం చేస్తే చంపేస్తానని అష్రఫ్ ను జహంగిర్ బెదిరించాడు. ఈ బెదిరింపుకు భయపడిన అష్రప్.. జహంగిర్ నిజంగానే చంపేస్తాడేమో అని తన సోదరుడు షఫీ(22)తో పాటు స్నేహితులు అర్భాజ్(22), హబీబ్ (26) సాయంతో కలిసి అతడిని చంపేయాలని నిర్ణయించుకున్నాడు. మాట్లాడుకుందామని చెప్పి లంగర్హౌస్ రింగ్ రోడ్డు సమీపంలో పీవీ నర్సింహారావు ఎక్స్ప్రెస్ వే పిల్లర్ నం.96 సమీపంలోని వైఫై బార్ వద్దకు జహంగిర్ ను పిలిచాడు. నిజమేనని నమ్మి అతడు అక్కడికి వచ్చారు. కానీ అప్పటికే కత్తులతో సిద్దంగా వున్న నలుగురు నిందితులు జహంగిర్ రాగానే ఒక్కసారిగా దాడికి దిగారు. దీంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.