వ్యవసాయ చట్టాలు: మనసు మార్చుకున్న రైతులు, చర్చలకు సిద్ధమంటూ మోడీకి లేఖ
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళన నెలలు గడుస్తున్నా.. కోవిడ్ మహమ్మారి కాటేస్తున్నా ఇంకా కొనసాగుతోంది. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ప్రతిష్టంభన వీడే అవకాశాలు కనిపిస్తున్నాయి
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళన నెలలు గడుస్తున్నా.. కోవిడ్ మహమ్మారి కాటేస్తున్నా ఇంకా కొనసాగుతోంది. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ప్రతిష్టంభన వీడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వంతో చర్చలు జరిపిందేందుకు రైతులు తాము సిద్ధమని ప్రకటించారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు.
అయితే దీనిపై కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా ఎటువంటి స్పందన రాలేదు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గత ఆరు నెలలుగా పంజాబ్, హర్యానా, యూపీ, రాజస్థాన్ తదితర రాష్ట్రాలకు చెందిన రైతులు దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దులో సింఘు, టిక్రీ వద్ద ఆందోళన నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
Also Read:సీఏఏ, వ్యవసాయ చట్టాలపై విపక్షాల దుష్ప్రచారం: మోడీ
40 రైతు సంఘాలన్నీ కలిసి రైతు సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీగా ఏర్పడ్డాయి. ప్రధాని మోడీ ప్రమాణ స్వీకారం చేసిన రోజైన మే 26న బ్లాక్డేగా ప్రకటించాయి. ఆరోజు నల్ల జెండాలు ఎగురవేసి నిరసన తెలపాలని పిలుపునిచ్చాయి. ఈ నిరసనలో పాల్గొనేందుకు వేలాదిగా ట్రాక్టర్లతో రైతులు ఛలో ఢిల్లీ అంటూ వస్తున్నారు. మరోసారి ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తప్పదన్న ఆందోళనల నేపథ్యంలో రైతులు మనసు మార్చుకున్నారు.
వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఇప్పటి వరకు ప్రభుత్వం, రైతుల మధ్య 11 సార్లు చర్చలు జరిగాయి. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ రైతులు పట్టుబడుతుండగా... రద్దు చేయడం కుదరదని కేవలం సవరణలు మాత్రమే చేస్తామంటూ ప్రభుత్వం పట్టు పడుతోంది. ఆరు నెలలు గడిచినా ఈ సమస్యకు పరిష్కారం లభించలేదు. తీవ్రమైన చలి, ఎండలను తట్టుకోవడంతో పాటు కరోనా సెకండ వేవ్ భయపెడుతున్నా సరే ... రైతులు ఢిల్లీని వీడకుండా ఆందోళన చేస్తూ తమ పట్టుదలను చాటుకున్నారు.