ఢిల్లీలో రైతుల ఆందోళనలు: సుప్రీంలో న్యాయవాది పిటిషన్
ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళనలపై సుప్రీంకోర్టులో న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు.
న్యూఢిల్లీ: ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళనలపై సుప్రీంకోర్టులో న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు.నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతులు 9 రోజులుగా ఆందోళనలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.రైతుల ఆందోళనల కారణంగా అత్యవసర సేవలకు ఇబ్బంది కలుగుతోందని పిటిషనర్ ఓంప్రకాస్ పరిహార్ ఆరోపించారు.
కరోనా వైరస్ కమ్యూనిటీ వ్యాప్తి దశలోకి చేరుకొంటే దేశంలో భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉందని ఆ పిటిషన్ లో ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.ఢిల్లీ సరిహద్దుల్లో అన్నదాతలు బైఠాయించడంతో ఆ మార్గాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో వైద్య సేవలకు ఈ మార్గం గుండా వెళ్లేవారికి ఇబ్బందులు తప్పడం లేదని పిటిషనర్ చెప్పారు.
also read:రైతుల ఆందోళనలు: పద్మ విభూషణ్ వెనక్కి ఇచ్చిన పంజాబ్ మాజీ సీఎం
ఈ రోడ్లను ఖాళీ చేయించేలా ఆదేశాలు ఇవ్వాలని ఆయన ఆ పిటిషన్ లో కోర్టును కోరారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.ఈ విషయమై కేంద్రం వెనక్కి తగ్గడం లేదు. నిన్న కేంద్రంతో రైతు సంఘాల ప్రతినిధులు నిర్వహించిన చర్చలు విఫలమయ్యాయి.దీంతో రైతులు తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు.