ప్రముఖ రంగస్థల దర్శకుడు, నటుడు, బీజేపీ మాజీ నేత అమీర్ రజా హుస్సేన్ కన్నుమూత.. ప్రముఖుల నివాళి..
ప్రముఖ రంగస్థల దర్శకుడు, నటుడు, బీజేపీ మాజీ నేత అమీర్ రజా హుస్సేన్ అనారోగ్యంతో చనిపోయారు. గుండె సంబంధిత వ్యాధితో ఆయన మరణించారని కుమారుడు గులాం అలీ అబ్బాస్ తెలిపారు.
ప్రముఖ రంగస్థల దర్శకుడు, నటుడు అమీర్ రజా హుస్సేన్ (66) గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ శనివారం తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుమారుడు గులాం అలీ అబ్బాస్ తెలిపారు. రెండు రోజుల పాటు ఆసుపత్రిలో ఉండి గుండె శస్త్రచికిత్స చేయించుకున్నా తన తండ్రి కోలుకోలేకపోయాని ఆయన పేర్కొన్నారు. రంగస్థల థియేటర్ కంపెనీ క్రియేటివ్ డైరెక్టర్ గా 91కి పైగా నిర్మాణాలు, 1,000కు పైగా ప్రదర్శనలతో సహా అనేక నాటకాలను నిర్మించి, నటించారు. 1999 కార్గిల్ యుద్ధం ఆధారంగా తీసిన "ది ఫిఫ్టీ డే వార్", హిందూ ఇతిహాసం రామాయణం నుండి ప్రేరణ పొందిన "ది లెజెండ్ ఆఫ్ రామ్" వంటి రంగస్థల ప్రదర్శనలతో హుస్సేన్ ఫేమస్ అయ్యారు.
పీటర్ ఓ టూల్ ప్రధాన పాత్రలో నటించిన రుడ్యార్డ్ కిప్లింగ్ నవల ఆధారంగా రూపొందిన ఇంగ్లీష్ మూవీ "కిమ్" (1984), సోనమ్ కపూర్ అహుజా, పాకిస్తాన్ నటుడు ఫవాద్ ఖాన్ నటించిన 2014 బాలీవుడ్ చిత్రం "ఖూబ్సురత్"లో కూడా ఆయన కనిపించారు. లక్నోలోని కులీన అవధి కుటుంబానికి చెందిన హుస్సేన్ 1957లో జన్మించారు. పాఠశాల విద్య పూర్తయిన తరువాత ఆయన న్యూఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో హిస్టరీ చదివారు. అక్కడ జాయ్ మైఖేల్, బారీ జాన్, మార్కస్ ముర్చ్ వంటి ప్రసిద్ధ దర్శకులతో కలిసి వివిధ నాటకాలలో నటించాడు.
హుస్సేన్ నాటక రంగానికి చేసిన ఎనలేని సేవలకు గాను 2001లో భారత ప్రభుత్వం ఆయనకు దేశ నాలుగో అత్యున్నత పౌర పురస్కారమైన ‘పద్మ శ్రీ’ ఇచ్చి సత్కరించింది. హుస్సేన్ ఒకప్పుడు ఢిల్లీ బీజేపీ ఉపాధ్యక్షుడిగా కూడా పనిచేశారు. 2013 జూలైలో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు పార్టీ నాయకత్వాన్ని ఆగ్రహానికి గురి చేయడంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు.
కాగా.. ఈయన మరణం పట్ల పలువురు ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలిపారు. 'ఆర్య' నటుడు వికాస్ కుమార్ ఇన్ స్టాగ్రామ్ లో ‘నా రంగస్థల గురువు’కు అని పోస్ట్ పెట్టి నివాళి అర్పించారు. సెయింట్ స్టీఫెన్ కాలేజీలో హుస్సేన్ సీనియర్ అయిన కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ కూడా ఆయన మరణం పట్ల సంతాపం ప్రకటించారు.
సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ కూడా హుస్సేన్ మృతికి సంతాపం తెలిపారు. ఆయన భారతీయ సంస్కృతికి నిజమైన ఐకాన్ అని, నాటక ప్రపంచానికి ఆయన చేసిన సేవలు రాబోయే తరాలకు గుర్తుండిపోతాయని అన్నారు. ఈ క్లిష్ట సమయంలో ఆయన కుటుంబం, స్నేహితులతో నా ఆలోచనలు, ప్రార్థనలు ఉన్నాయి అని ట్వీట్ చేశారు. కాగా.. హుస్సేన్ కు భార్య విరాట్ తల్వార్, కనీజ్ సుకైనా, గులాం అలీ అబ్బాస్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.