ఝాన్సీలో కరెంట్ కోతలతో ఉక్కపోత భరించలేని కుటుంబం ATMలో నిద్రించడంతో వీడియో వైరల్ అయ్యింది.
వేసవి కాలం మొదలైందంటే చాలు..ఎండలు పెరగడంతో పాటు..కరెంట్ కోతలు కూడా తీవ్రతరమవుతాయి. ఎంత ఫ్యానులు ఏసీలు తిరుగుతున్నప్పటికీ..కరెంట్ పోతే చాలు వెంటనే నిద్ర మెలకువ వచ్చేస్తుంది. దీంతో కనీసం బయట అయినా పడుకుందామనుకున్నారు ఆ కుటుంబం.కానీ బయట కూడా తీవ్రమైన ఉక్కపోత..దీంతో ఏం చేయాలో తెలియక రాత్రి తెల్లవార్లు తిరుగుతూనే ఉన్నారు.
పిల్లలు అయితే ఉక్కపోతకి తట్టుకోలేక పదేపదే చల్లటి నీటితో శరీరాన్ని కడిగినప్పటికీ లాభం లేకపోయింది. దీంతో ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్న వారికి దేవతలా ఓ చోట లైటు వెలుగుతూ కనిపించింది. దాంతో కుటుంబం అంతా కలిసి అక్కడికి వెళ్లారు. అక్కడకి వెళ్లి చూడగా అది ఓ ఏటీఎం. తలుపు తీసిన వెంటనే ఏసీ ఉండడంతో చల్లగా అనిపించింది. దాంతో వెంటనే లోపలికి వెళ్లి హాయిగా నిద్ర పోయారు. దీంతో ప్రతిరోజూ అక్కడే పడుకుంటున్నారు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తర ప్రదేశ్ ఝాన్సీలో నిత్యం కరెంటు కోతలు విధిస్తున్నారు. అసలే వేసవి కాలం కావడం, అందులోనూ అర్ధరాత్రుళ్లు కరెంటు తీసి వేయడంతో ప్రజలు రోడ్ల మీదకి వచ్చి తీవ్ర స్థాయిలో నిరసనలు చేస్తున్నారు. కనీసం అర్ధరాత్రుళ్లు అయినా విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఎవరు ఏం చేసినా అక్కడి సర్కారులో మాత్రం ఎలాంటి స్పందన లేదు.
చల్లగా ఉండేసరికి…
దీంతో అక్కడి ప్రజలంతా వాకిళ్లు, మిద్దెలపైనే పడుకుంటున్నారు. అక్కడి ఓ కుటుంబం కూడా ఇలాగే చేయగా.. వారి పిల్లలు తరచుగా గాలి సరిపోక మేల్కోవడం ఇంటి యజమానులు గుర్తించారు. వారికి నిద్ర పట్టేలా ఏం చేయాలని ఆలోచిస్తూ.. తిరుగుతుండగా.. వారికి ఓ చోట లైట్ వెలుగుతూ కనిపించింది. దీంతో నేరుగా అక్కడకు వెళ్లారు. తీరా చూస్తే అది ఏటీఎం కాగా.. లోపలికి వెళ్లారు. అందులో చల్లగా ఉండేసరికి అక్కడే పడుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరు మహిళలు.. తమ పిల్లలతో కలిసి రోజూ అక్కడే నిద్రిస్తున్నారు. మొదట్లో ఈ విషయం ఎవరూ గుర్తించకపోయినా.. ఆ తర్వాత ఈ విషయం అందరికీ తెలిసిపోయింది.
కరెంట్ కోతల వల్లే…
కొందరు ఈ విషయాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టగా.. తెగ వైరల్ అవుతోంది. ముఖ్యంగా ఈ వీడియో సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ చూసి దీన్ని షేర్ చేశారు. సీఎం ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బీజేపీ సర్కారుతో పాటు విద్యుత్ శాఖపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఇదంతా చూసిన మీడియా వారు అక్కడికి వెళ్లి ఆ కుటుంబాన్ని ప్రశ్నించగా..కరెంట్ కోతల వల్లే ఇలా నిద్రించాల్సి వస్తుందని వారు చెబుతున్నారు.