Free Current Process: ఫ్రీ కరెంట్ స్కీమ్ మార్గదర్శకాలు ఇవే !
Free Current Process: ఆరు గ్యారెంటీల అమలు దిశగా కాంగ్రెస్ అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఆరు గ్యారెంటీల్లో రెండు హామీలు అమలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు మరో రెండు గ్యారెంటీలు అమలు చేసేందుకు కసరత్తు ప్రారంభించింది. ఇందులో ముఖ్యంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అమలు చేయాలని భావిస్తోంది.
![200 Units of Free Power Gruha Jyoti for Tenants Too krj 200 Units of Free Power Gruha Jyoti for Tenants Too krj](https://static-ai.asianetnews.com/images/01hk83f431zj8895n7kjpgwbtn/Electricity-1704300351584_363x203xt.jpg)
Free Current Process: తెలంగాణలో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి తన మార్క్ చూపిస్తున్నారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను క్రమంగా నెరవేర్చుతున్నారు. ఇప్పటికే ఆరు గ్యారెంటీల్లో మహాలక్ష్మీ పథకాన్ని అమలు చేసి ఆర్టీసీ బస్సుల్లో మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తున్నారు. అలాగే.. ఆరోగ్య శ్రీ పథక పరిమితిని రూ. 10 లక్షలకు పెంచింది . ఇప్పుడు మరో రెండు గ్యారెంటీలను అమలు చేయడానికి రేవంత్ సర్కార్ ప్రణాళికలు రచిస్తోంది. ఈ క్రమంలో గృహ జ్యోతి పథకం ద్వారా ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ను అందించాలని ప్రణాళికలు రచిస్తోంది. ఈ పథకానికి తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. త్వరలో జరుగబోయే అసెంబ్లీ సమావేశాల్లో అధికారికంగా ప్రకటించనున్నది.
ఈ నేపథ్యంలో గృహ జ్యోతి (ఉచిత విద్యుత్ )పథకానికి సంబంధించి లబ్థిదారుల ఎంపిక నేటి నుంచే జరుగనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అర్హుల వివరాల సేకరణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో విద్యుత్ సిబ్బందే ఇంటింటికీ తిరిగి కరెంటు మీటర్ రీడింగ్ తీసి యజమానుల నుంచి రేషన్ కార్డు, ఆధార్ కార్డు నంబర్లతో పాటు మొబైల్ నంబర్లను అనుసంధానం చేసుకోనున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఉచిత విద్యుత్ పథకానికి మార్గదర్శకాలివేననే ప్రచారం జోరుగా సాగుతోంది. ముఖ్యంగా తెల్ల రేషన్ కార్డు ఉంటేనే 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ను అందించాలని భావిస్తుందట ప్రభుత్వం.
గృహ జ్యోతి పథకానికి రూల్స్ ఇవే!
ఈ పథకం రేషన్ కార్డుతో పాటు ఒక ఇంటికి ఒక విద్యుత్ మీటర్ కే వర్తిస్తుందట. రేషన్ కార్డు లేని వారి నుంచి వివరాలను సేకరించరు. అంతేకాకుండా అద్దెకు ఉండే వారికి ఈ పథకం వర్తించదని వార్తలు వచ్చాయి. తాజాగా దీనిపై విద్యుత్ పంపిణీ సంస్థ TSSPDCL స్పందించింది. ఇలాంటి వార్తలు నమ్మవొద్దని.. ‘గృహజ్యోతి’ పథకానికి అద్దె ఇళ్లలో ఉండేవారు కూడా అర్హులే అని స్పష్టం చేశారు. అర్హులైన వారు కిరాయి ఇళ్లల్లో ఉన్నా వారికి ఈ పథకం వర్తిస్తుందని అధికారులు ట్వీట్టర్ వేధికగా వెల్లడించారు. 200 యూనిట్ల లోపు కరెంట్ వాడుకునే వారికి మాత్రమే ఈ పథకం వర్తించనున్నట్లు స్పష్టమవుతోంది.