ఏకపక్ష ప్రయత్నాలను ఎట్టి పరిస్థితిలో సహించబోం.. చైనాకు మంత్రి జైశంకర్ వార్నింగ్
వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి చైనా ఏకపక్షంగా ఏదైనా చర్యలకు పాల్పడితే భారత్ ఉపేక్షించబోదని విదేశాంగ మంత్రి జై శంకర్ హెచ్చరించారు. ఒకవేళ సరిహద్దుల వద్ద చైనా అక్రమంగా తన బలగాలను మోహరించాలని ప్రయత్నిస్తే.. భారత్-చైనా మధ్య తీవ్ర ప్రభావం పడుతుందని సూచించారు.
వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఎసి)ను మార్చడానికి చైనా ఏకపక్షంగా ఏదైనా చర్యలకు పాల్పడితే భారత్ సహించబోదని, అలాగే సరిహద్దు వెంబడి చైనా తన బలగాలను మోహరించాలని ప్రయత్నాలు కొనసాగిస్తే ఇరుదేశాలపై తీవ్ర ప్రభావం పడుతుందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ హెచ్చరించారు. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వద్ద చైనా పాల్పడుతున్న దుశ్చర్యలను రాజ్యసభలో కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ ప్రస్తవించారు. భారత విదేశాంగ విధానం విషయంలో ప్రస్తుతం చోటుచేసుకుంటున్ననూతన పరిణామాలను, భారత సైన్య విజయాలను వివరించారు.
పార్లమెంటు శీతాకాల సమావేశాల తొలి రోజు(బుధవారం నాడు).. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వెంబడి నాలుగు దశాబ్దాలకు పైగా జరిగిన అత్యంత ఘోరమైన ఘర్షణలు, జూన్ 2020లో గాల్వాన్ లోయలో 20 మంది భారతీయ సైనికుల హత్యల గురించి ప్రతిపక్షలు పలు ప్రశ్నలను లేవనెత్తాయి. వారి ప్రశ్నలకు మంత్రి జైశంకర్ సమాధానమిస్తూ.. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వద్ద చైనా ఏకపక్షంగా ఏదైనా చర్యలకు పాల్పడితే ఉపేక్షించబోమని , ఇరు దేశాల సత్సంబంధాల విషయంలోనూ ప్రతికూల ప్రభావం చూపుతుందని హెచ్చరించారు.
ఎల్ఎసిపై ఘర్షణ పాయింట్లకు పరిష్కారాలను కనుగొనడానికి రెండు దేశాల మిలిటరీ కమాండర్లు పరస్పరం నిమగ్నమై ఉన్నారు. లడఖ్ సెక్టార్లో 2020 మే నుండి భారతదేశం, చైనా సైనిక ప్రతిష్టంభన కొనసాగుతుందని, ఈ సమస్యను పరిష్కరించడానికి రెండు డజనుకు పైగా దౌత్య, సైనిక చర్చలు జరిగాయనీ, డెప్సాంగ్ , డెమ్చోక్ వంటి ఘర్షణ పాయింట్ల వద్ద ముఖాముఖి చర్చలు విఫలమయ్యాయని తెలిపారు.ఆగస్టులో జరిగిన చివరి పార్లమెంటరీ సమావేశాల నుండి భారతదేశం యొక్క కీలక విదేశాంగ విధాన కార్యక్రమాలను వివరించారు.
జూలైలో సైనిక కమాండర్ల మధ్య 16వ రౌండ్ చర్చల తరువాత..సెప్టెంబరులో రెండు దేశాలు వివాదాస్పద స్థలం నుంచి ఫ్రంట్లైన్ దళాలను ఉపసంహరించుకున్నాయి. దీనికి ముందు.. LACపై ఘర్షణ పాయింట్ల నుండి భారతదేశం,చైనీస్ దళాలను తొలగించడానికి సంవత్సరానికి పైగా సమయం పట్టింది. చివరి పురోగతి ఆగస్టు 2021లో వచ్చింది. రెండు వైపులా గోగ్రా నుండి సైనికులను విరమించుకున్నారు. గాల్వాన్ వ్యాలీ, పాంగోంగ్ లేక్, గోగ్రా, హాట్ స్ప్రింగ్స్ పాంత్రాల్లో ఇరుదేశాలు దాదాపు 60,000 మంది సైనికులను మోహరించాయి.