ప్రధాని నరేంద్ర మోదీ నేడు(ఏప్రిల్ 24) జమ్మూ కశ్మీర్‌లో పర్యటించనున్నారు. జమ్మూ కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తి హోదానిచ్చే ఆర్టికల్ 370 రద్దు తర్వాత మోదీ తొలిసారిగా నేడు అక్కడ పర్యటించనున్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ నేడు(ఏప్రిల్ 24) జమ్మూ కశ్మీర్‌లో పర్యటించనున్నారు. జమ్మూ కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తి హోదానిచ్చే ఆర్టికల్ 370 రద్దు తర్వాత మోదీ తొలిసారిగా నేడు అక్కడ పర్యటించనున్నారు. అయితే జమ్మూ కశ్మీర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ర్యాలీ జరిగే ప్రాంతానికి 12 కిలోమీటర్ల దూరంలోని ఓ పొలంలో పేలుడు సంభవించింది. జమ్మూ జిల్లాలోని లాలియానా గ్రామంలో ఆదివారం ఈ పేలుడు సంభవించింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. 

ఉల్క లేదా మెరుపు వల్ల లాలియానా గ్రామంలో బిలం ఏర్పడిందని జమ్మూ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ చందన్ కోహ్లీ తెలిపారు. పేలుడు ఉగ్రదాడులకు సంబంధించినదిగా కనిపించడం లేదని కూడా పోలీసులు తెలిపారు.

ఇదిలా ఉంటే.. ప్రధాని మోడీ జమ్మూ కశ్మీర్ పర్యటనకు ముందు దక్షిణ కాశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలోని మిర్హామా ప్రాంతంలో భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. మరణించిన ఇద్దరు ఉగ్రవాదులను నిషేధిత జైష్-ఎ-మహ్మద్‌కు చెందిన పాకిస్తానీ జాతీయులుగా గుర్తించినట్లు అధికారులు ఆదివారం తెలిపారు. మరోవైపు శుక్రవారం సుంజ్వాన్‌లో చోటుచేసుకున్న ఎన్‌కౌంటర్‌లో లష్కరే తోయిబాకు ఉగ్ర సంస్థకు చెందిన ఇద్దరిని భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో సీఐఎస్ఎఫ్‌ అసిస్టెంట్‌ ఎస్సై ఒకరు వీరమరణం పొందారు. 

ఈ క్రమంలోనే ఎన్‌ఐఏ అధిపతి కుల్‌దీప్ సింగ్ శనివారం సుంజ్వాన్ ప్రాంతానికి చేరుకున్నారు. మోదీ పర్యటించనున్న పల్లీ గ్రామానికి చేరుకుని అక్కడి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో జమ్మూ కశ్మీర్‌లో భద్రతను కట్టుదిట్టం చేశారు. 

ఇక, జమ్మూ కశ్మీర్‌లో రూ. రూ. 20,000 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఇందులో బనిహాల్-ఖాజిగుండ్ సొరంగ మార్గం, ఢిల్లీ-అమృత్‌సర్-కత్రా ఎక్స్‌ప్రెస్ వే, రాట్లే క్వార్ జలవిద్యుత్ ప్రాజెక్టులు ఉన్నాయి. జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా సాంబా జిల్లాలోని పల్లీ గ్రామం నుంచి దేశవ్యాప్తంగా గ్రామసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.