ఇండియన్ ఆర్మీలో చేరాలనుకున్నా.. పరీక్ష కూడా రాశాను. కానీ... - రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్
తాను చిన్నతనంలో ఆర్మీలో చేరాలని భావించానని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. అయితే పలు కారణాల వల్ల చేరలేకపోయానని చెప్పారు.
తాను చిన్నతనంలోనే భారత సైన్యంలో చేరాలనుకుంటున్నానని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. తాను పరీక్ష కూడా రాశానని, కానీ కుటుంబంలో నెలకొన్న కొన్ని కారణాల వల్ల అది కుదరలేదని వెల్లడించారు. అస్సాం రైఫిల్స్, ఇండియన్ ఆర్మీలోని 57వ మౌంటైన్ డివిజన్ సైనికులను ఉద్దేశించి ఆయన శుక్రవారం మాట్లాడారు. ‘‘ నా చిన్నప్పటి కథ మీకు చెప్పాలని ఉంది. నేను కూడా సైన్యంలో చేరాలని భావించాను. దాని కోసం ఒకసారి ‘షార్ట్ సర్వీస్ కమిషన్’ పరీక్షకు కూడా హాజరయ్యాను. నేను రాత పరీక్షలో పాస్ అయ్యాను. కానీ మా నాన్న మరణం, ఇతర కుటుంబ సమస్యల కారణంగా నేను సైన్యంలో చేరలేకపోయాను. ’’ అని ఆయన తన గతాన్ని పంచుకున్నారు. ‘ పిల్లవాడికి ఆర్మీ యూనిఫాం ఇస్తే.. అతని వ్యక్తిత్వం మారిపోతుందని అందరికీ తెలుసు. ఆ యూనిఫాంకు ఉన్న తేజస్సు అలాంటిది. ’’ అని రాజ్ నాథ్ సింగ్ అన్నారు.
రేపిస్టుల విడుదలపై న్యాయవ్యవస్థను తప్పుపట్టడం సరికాదు.. ఆ జడ్జీ ఏమన్నాడంటే?
ఈ కార్యక్రమంలో ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే కూడా హాజరయ్యారు. కార్యక్రమానికి ముందు వీరిద్దరు సైనికులు, సైనికాధికారులతోనూ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ భారత్, చైనా మధ్య ప్రతిష్టంభన సందర్భంగా భద్రతా బలగాలు చూపిన ధైర్యసాహసాలను గుర్తు చేసుకున్నారు. ‘‘ భారత్-చైనా ప్రతిష్టంభన కొనసాగుతున్నప్పుడు, మీ వద్ద సరైన వివరాలు లేకపోవచ్చు. కానీ మా జవాన్ల ధైర్యసాహసాలెంటో నాకు, ఆనాటి ఆర్మీ చీఫ్కు తెలుసు. మన దేశం ఎప్పుడూ మీకు రుణపడి ఉంటుంది.’’ అని అన్నారు.
‘ నేను ఎక్కడికి వెళ్లినా సైనిక సిబ్బందిని కలుస్తాను.మణిపూర్లో నా పర్యటన ప్లాన్ చేసినప్పుడు నేను అస్సాం రైఫిల్స్, 57వ మౌంటైన్ డివిజన్ సిబ్బందిని కలవాలనుకుంటున్నానని (ఆర్మీ చీఫ్) పాండే జీకి చెప్పాను. ఆర్మీ సిబ్బందిని కలవడం చాలా గర్వంగా భావిస్తున్నాను. డాక్టర్లు, ఇంజనీర్లు, చార్టర్డ్ అకౌంటెంట్లు దేశానికి ఏదో ఒక విధంగా తమ వంతు సహాయాన్ని అందిస్తున్నారు. కానీ మీది వృత్తి అనడం కంటే సేవ అనేది నేను నమ్ముతున్నాను. ’’ అని రాజ్ నాథ్ సింగ్ అన్నారు. అసోం రైఫిల్స్ చాలా మందిని జన జీవన స్రవంతిలోకి తీసుకురావడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని తెలిపారు. దానిని ఈశాన్య రాష్ట్రాల కాపలాదారుగా పిలవడం న్యాయమని ఆయన అన్నారు. కాగా రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్ రెండు రోజుల పర్యటన నిమిత్తం మణిపూర్లో పర్యటిస్తున్నారు.