సీఎం పదవి రేసులో సిద్ధరామయ్య గెలిచినా.. డీకే శివ కుమార్ కే అధిక ప్రయోజనాలు.. ఎలాగంటే ?
ఎన్నో చర్చల తరువాత ఎట్టకేలకు కర్ణాటక సీఎం పదవి సిద్ధరామయ్యకు దక్కింది. అయితే ఆ దక్షిణాది రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుపునకు కీలక పాత్ర పోషించిన డీకే శివ కుమార్ డిప్యూటీ సీఎం పోస్టుతో సరిపెట్టుకోనున్నారు. అయితే తాజా పరిణామాల వల్ల డీకే శివ కుమార్ కే ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయి.
సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఇద్దరూ కర్ణాటక ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడ్డారు. అయినా ఈ రేసులో సిద్ధరామయ్యకే అనుకూలత ఎక్కువని మొదటి నుంచీ అర్థమైంది. అయితే కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ కూడా కాంగ్రెస్ గెలుపు కోసం చాలా కష్టపడ్డారు. ఆయన అపారమైన కృషి, వనరుల ఖర్చు, కాంగ్రెస్ విజయంలో కీలక పాత్ర పోషించింది. అయినప్పటికీ ఆయనకు సీఎం పదవి దక్కలేదు. కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ ప్రయోజనాల కోసం మాజీ ముఖ్యమంత్రికే మళ్లీ పగ్గాలు అప్పగించింది. అయినా కూడా డీకే శివ కుమార్ ఈ పరిణామం వల్ల అనేక ప్రయోజనాలు పొందనున్నారు.
‘అహిందా’ వ్యూహంలో నిపుణుడు, ఫోన్ వాడని నాయకుడు సిద్ధరామయ్య.. ఇతర పార్టీల్లో కూడా గౌరవం ఆయన సొంతం
కొంత కాలం నుంచి ఆదాయానికి మించిన ఆస్తులకు సంబంధించి ఆదాయపు పన్ను, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులను డీకే శివకుమార్ ఎదుర్కొంటున్నారు. ఈ కేసులపై కేంద్ర ప్రభుత్వం దూకుడుగా వ్యవహరించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. 2024 ఎన్నికలకు ముందు ఇలాంటి కేసులతో సతమతమవుతున్న ఒక ముఖ్యమంత్రి కాంగ్రెస్ కు ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రస్తుత బీజేపీ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేస్తూ కాంగ్రెస్ నాయకులు ‘‘40 శాతం సర్కార్’’ అని ప్రచారం చేసి విజయం సాధించారు. ఇలాంటి సమయంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న డీకే శివకుమార్ ను సీఎంగా ఎంపిక చేయడం సరైంది కాదని అధిష్టానం భావించింది.
ముఖ్యమంత్రి ఎవరన్నదానిపై కాంగ్రెస్ సందిగ్ధంలో ఉండగానే, డీకే శివకుమార్ అక్రమాస్తుల దర్యాప్తుపై మధ్యంతర స్టేను సవాలు చేస్తూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఈ పరిణామం ఆయనపై ఇంకా కేసులు సజీవంగా ఉన్నాయని, అవి ఆయనను నీడలా వెంటాడుతున్నాయని గుర్తు చేస్తోంది. కర్ణాటకలో అత్యున్నత పదవి రేసులో ఆయనను వెనక్కి నెట్టింది.
కర్ణాటకలోని శాసనసభ్యులందరిలో సిద్ధరామయ్య అత్యంత ఆధరణ పొందిన మాస్ లీడర్. కర్ణాటకలోని వివిధ ప్రాంతాల్లో ఆయనకు మెజారిటీ కాంగ్రెస్ ఎమ్మెల్యేల మద్దతు ఉంది. ఆయన స్థాయి, అనుభవం సీఎం పదవికి ఎంపిక విషయంలో కలిసి వచ్చాయి. అలాగే గతంలో పూర్తి కాలం పాటు సీఎంగా కొనసాగడం ఆయనకు అనుకూలంగా మారింది. కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ నుంచి బలమైన పోటీ లేకుండా ఉంటే సులువుగానే పార్టీ ఆయనను సీఎంగా ఎంపిక చేసేది. అధిష్టానానికి ఆయనే మొదటి ఎంపిక అయ్యేవారు.
డీకే శివకుమార్ ఓబీసీ వొక్కలిగ కులానికి చెందిన వ్యక్తి. అయితే ఆయనకు సీఎం పదవి కట్టబెట్టకపోయినా బలమైన డిప్యూటీ సీఎం పదవికి కేటాయించడం వల్ల ఆ వర్గాల నుంచి వచ్చే ప్రతికూలతను పూడ్చే అవకాశం ఉంది. వాస్తవానికి కాంగ్రెస్ లో ‘ఒక వ్యక్తి, ఒకే పదవి’ నిబంధన అమలు చేస్తోంది. కానీ శివ కుమార్ సీఎం పదవి కోసం గట్టిగా పట్టుబట్టడంతో ఆ నిబంధనకు మినహాయింపు ఇచ్చి కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగానూ కొనసాగిస్తోంది. దీంతో ఆయనకు మంత్రి వర్గంపై గణనీయమైన పలుకుబడి, పార్టీపై గట్టి పట్టు లభిస్తుంది. శివకుమార్ కు, ఆయన సన్నిహితులకు కీలక శాఖలు దక్కే అవకాశం ఉంది.
సీఎం పదవి విషయంలో ఇద్దరు పోటీదారులకు సాధ్యమైనంత ఉత్తమ ఫలితాన్నిచ్చే పరిష్కారాన్ని కాంగ్రెస్ సాధించింది. అయితే సిద్ధరామయ్య, శివకుమార్ ఇద్దరూ పాత మైసూరు ప్రాంతానికి చెందిన వారే కావడంతో మంత్రివర్గంలో అన్ని ప్రాంతాలు, సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించడమే ఇప్పుడు కాంగ్రెస్ ముందున్న సవాలుగా మారింది. ఎందుకంటే 2024 లోక్ సభ ఎన్నికల సమయంలో ఇది చాలా ప్రభావం చూసే అవకాశం ఉంది.