కోర్ట్ ఆర్డర్‌తో అన్నాడీఎంకే పార్టీ బాస్‌గా పళనిస్వామిని పార్టీ కార్యాలయానికి గురువారం తిరిగి వచ్చారు. ఈ క్ర‌మంలో అన్నాడీఎంకే కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆయ‌న‌కు ఘనస్వాగతం పలికారు. 

తమిళనాట శక్తిగా ఉన్న అన్నాడీఎంకేలో అధిప‌త్యం పోరు కొన‌సాగుతోంది. పార్టీ అధిప‌త్యం కోసం మాజీ ముఖ్యమంత్రులు ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్‌), ఓ పన్నీర్ సెల్వం (ఓపీఎస్‌)ల మధ్య కోల్డ్ వార్ జ‌రుగుతోంది. తాజాగా పన్నీర్ సెల్వంకు అనుకూలంగా సింగిల్‌ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను మద్రాస్‌ హైకోర్టు కొట్టివేసింది. పళనిస్వామిని పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడాన్ని, పన్నీర్ సెల్వంను పార్టీ నుంచి బహిష్కరించడాన్ని సమర్థించింది. 

ఈ నేపథ్యంలో ఎడప్పాడి పళనిస్వామి పార్టీ తాత్కాలిక బాస్‌ హోదాలో అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయానికి గురువారం తిరిగి వచ్చారు. అనుచరులు, మద్దతుదారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. తొలుత పార్టీ కార్యాలయం వద్ద ఉన్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రులు ఎంజి రామచంద్రన్ (ఎంజిఆర్), జె జయలలిత విగ్రహాలకు నివాళులు అర్పించారు.

అనంతరం పళనిస్వామి పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. పన్నీర్ సెల్వంపై మండి ప‌డ్డారు. ఆయ‌న పార్టీ కార్యాలయంలో విద్వేషాలు రెచ్చ‌గొట్టాడ‌ని మండిపడ్డారు. పన్నీర్ సెల్వం ఊసరవల్లి లాంటి వ్యక్తి అని, ఆయన పార్టీకి తీర‌ని ద్రోహం చేశారని ఆరోపించారు.త్వరలో పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి ఎన్నికలు జరుగుతాయని అన్నారు. ఇదిలాఉంటే.. మరోవైపు మద్రాస్‌ హైకోర్టు తీర్పును పన్నీర్ సెల్వం స‌వాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు. 

ఎఐఎడిఎంకె బాస్‌గా ఇపిఎస్‌ని జూలై 11న పెంచిన తర్వాత ఇద్దరు నేతల మద్దతుదారులు చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయం వెలుపల కూడా ఘర్షణ పడ్డారు. ఈ భవనాన్ని ఈపీఎస్‌కు అప్పగించాలని మద్రాసు హైకోర్టు ఆదేశించే వరకు సీల్‌ వేశారు. హింసాత్మక ఘర్షణలపై విచారణ నిన్న ప్రారంభమైంది.

ఈ ద్వంద్వ నాయకత్వం సమయంలోనే అన్నాడీఎంకే బీజేపీతో పొత్తు పెట్టుకుంది. 2016లో జయలలిత మరణం తర్వాత పార్టీ వరుసగా మూడు ఎన్నికల్లో ఓటమి చవిచూసింది. ఏఐఏడీఎంకే నేతలు ఈపీఎస్‌కు మద్దతిచ్చే ద్వంద్వ నాయకత్వ విధానంలో నిర్ణయం తీసుకోవడం కష్టమని పేర్కొన్నారు.

Scroll to load tweet…