చైనీస్ లోన్ యాప్ కేసులో 7 సంస్థలు సహా ఐదుగురిపై ఈడీ కేసు..
Bengaluru: చైనీస్ లోన్ యాప్ కేసులో 7 సంస్థలు, 5 మంది వ్యక్తులపై బెంగళూరు కోర్టులో ఈడీ కేసు దాఖలు చేసింది. ఇందులో మూడు ఫిన్టెక్ కంపెనీలు, ఆర్బీఐలో రిజిస్టర్ అయిన మూడు ఎన్బీఎఫ్సీలు, ఒక పేమెంట్ గేట్వేను నిందితులుగా పేర్కొంది.
Chinese loan app case: దేశంలో గత కొంత కాలంగా లోన్ యాప్ నిర్వాహకులు అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు వచ్చాయి. పలువురు ఇదే విషయం గురించి అధికారులకు సైతం ఫిర్యాదు చేశారు. బెంగళూరు సీఐడీ(ప్రతినిధి) ఎఫ్ఐఆర్లు నమోదు చేసిన తర్వాత ఈ కేసుల్లో ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. ఈ క్రమంలోనే చైనీస్ లోన్ యాప్ కేసులో 7 సంస్థలు, 5 మంది వ్యక్తులపై బెంగళూరు కోర్టులో ఈడీ కేసు దాఖలు చేసింది. ఇందులో మూడు ఫిన్టెక్ కంపెనీలు, ఆర్బీఐలో రిజిస్టర్ అయిన మూడు ఎన్బీఎఫ్సీలు, ఒక పేమెంట్ గేట్వే నిందితులుగా పేర్కొంది.
ప్రస్తుతం సమాచారం ప్రకారం.. చైనీస్ లోన్ యాప్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బెంగళూరులోని ప్రత్యేక పీఎంఎల్ఏ కోర్టులో ఏడు సంస్థలు, ఐదుగురు వ్యక్తులపై ప్రాసిక్యూషన్ ఫిర్యాదు దాఖలు చేసింది. నిందితుల్లో చైనా పౌరుల నియంత్రణలో ఉన్న మూడు ఫిన్టెక్ కంపెనీలు - మ్యాడ్ ఎలిఫెంట్ నెట్వర్క్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్, బారియోనిక్స్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్, క్లౌడ్ అట్లాస్ ఫ్యూచర్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ లు ఉన్నాయి. అలాగే, కేంద్ర రిజర్వు బ్యాంకు (RBI)లో రిజిస్టర్ చేయబడిన మూడు NBFCలు - X10 ఫైనాన్షియల్-లిమిటెడ్ ప్రైవేట్ లిమిటెడ్ ఎడ్ ప్రైవేట్ లిమిటెడ్, జమ్నాదాస్ మొరార్జీ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సహా ఒక చెల్లింపు గేట్వే అయిన Razorpay సాఫ్ట్వేర్ ప్రైవేట్ లిమిటెడ్ ఉంది.
అంతకుముందు, ఈడీ రెండు తాత్కాలిక అటాచ్మెంట్ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిలో బ్యాంక్ ఖాతాలు, చెల్లింపు గేట్వేలలో రూ.77.25 కోట్లను అటాచ్ చేసింది. రుణాలు తీసుకున్న, ఈ వడ్డీ కంపెనీల రికవరీ ఏజెంట్ నుంచి వేధింపులు ఎదుర్కొన్న పలువురు ఖాతాదారుల నుంచి అందిన ఫిర్యాదుల ఆధారంగా బెంగళూరు సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. డిజిటల్ లెండింగ్ యాప్ ల ద్వారా రుణాల పంపిణీ కోసం ఫిన్టెక్ కంపెనీలు సంబంధిత ఎన్బీఎఫ్సీలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది.
ఈ ఫిన్టెక్ కంపెనీలు మనీ లెండింగ్ వ్యాపారాన్ని చట్టవిరుద్ధంగా నిర్వహిస్తున్నాయనీ, ఆర్బీఐ ఫెయిర్ ప్రాక్టీసెస్ కోడ్ ను ఉల్లంఘించి ఫిన్టెక్ సంస్థలపై ఎలాంటి తనిఖీలు నిర్వహించకుండా ఎన్బీఎఫ్సీలు ఉద్దేశపూర్వకంగానే ఫిన్టెక్ కంపెనీల పేర్లను కమీషన్ కోసం ఉపయోగించుకునే అవకాశం కల్పిస్తున్నాయని తేలింది. చైనీస్ లోన్ యాప్ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని సంబంధిత వర్గాలు తెలిపాయి.