PM Modi G7 Summit: ప్రజాస్వామ్య భారతానికి ఎమర్జెన్సీ ఒక మచ్చలాంటిది: ప్రధాని మోదీ
PM Modi G7 Summit: భారత ప్రధాని మోదీ జీ 7 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడానికి జర్మనీ వెళ్లారు. ఈ క్రమంలో ప్రవాస భారతీయులతో సమావేశమైన ఆయన .. 47 ఏళ్ల క్రితం విధించిన ఎమర్జెన్సీపై కీలక వ్యాఖ్యలు చేశారు.
PM Modi G7 Summit: భారతదేశ ప్రజాస్వామ్య విలువలను ప్రధాని మోడీ కొనియాడారు. 47 ఏళ్ల క్రితం విధించిన ఎమర్జెన్సీ భారత సజీవ ప్రజాస్వామ్యానికి నల్ల మచ్చ అని అన్నారు. నలభై ఏడేళ్ల క్రితం ప్రజాస్వామ్యాన్ని అణిచివేసే ప్రయత్నం జరిగిందని కాంగ్రెస్ పై విమర్శలు కురిపించారు.
G7 Summitలో పాల్గొనడానికి ప్రధాని మోడీ జర్మనీకి వెళ్లారు. ఈ క్రమంలో ఆదివారం ఆడి డోమ్ ఇండోర్ ఎరీనాలో జరిగిన భారీ సమావేశంలో ప్రధాని పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రవాస భారతీయులను ఉద్యేషించి మాట్లాడారు. భారతీయులమైన మనం ఎక్కడ నివసించినా.. మన ప్రజాస్వామ్యాన్ని గర్విస్తామనీ, భారతదేశం.. ప్రజాస్వామ్యానికి తల్లి లాంటిందని, ప్రతి భారతీయుడు గర్వంగా చెప్పగలడని అన్నారు.
1975లో భారతదేశ ప్రజాస్వామ్యాన్ని అణిచివేసే కుట్ర జరిగిందని కాంగ్రెస్ పై విమర్శల దాడి చేశారు. కానీ ఆనాటీ భారత ప్రజలు ప్రజాస్వామ్య పద్ధతిలో సమాధానం చెప్పారని అన్నారు. కాంగ్రెస్ అధినేత్రి ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న కాలంలో జూన్ 25, 1975న దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించారు. ఈ ఎమర్జెన్సీ మార్చి 21, 1977 వరకు కొనసాగింది. ఈ మధ్య కాలంలో దేశంలో అనేక అణచివేత కార్యక్రమాలు జరిగాయని తెలిపారు.
నేడు భారత్ అన్ని రంగాల్లో దూసుకుపోతుందని, భారత సాంస్కృతిక వైవిధ్యం, ఆహారం, వస్త్రధారణ, సంగీతం, సంప్రదాయాలన్నీ ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టాయని అన్నారు. నూతన పారిశ్రామిక విప్లవానికి భారత దేశం ప్రొత్సహిస్తోందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. అలాగే.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలోనూ, డిజిటల్ టెక్నాలజీలో భారత్ తన జెండాను ఎగురవేస్తోందని ప్రశంసించారు.
నేడు భారతదేశంలోని ప్రతి పల్లెకు విద్యుత్ వచ్చిందని, దాదాపు ప్రతి గ్రామాన్ని అనుసంధానం చేయడానికి రోడ్డు ఉన్నాయని తెలిపారు. అలాగే.. నేడు భారతదేశంలోని 99% కంటే ఎక్కువ మంది వంట కోసం గ్యాస్ కనెక్షన్ని కలిగి ఉన్నారనీ, ప్రతి కుటుంబం బ్యాంకింగ్ వ్యవస్థతో అనుసంధానించబడి ఉందని తెలిపారు. అలాగే.. దేశంలోని 80 కోట్ల మంది పేదలకు గత రెండేళ్లుగా ఉచిత రేషన్ అందిస్తున్నామని, తమ ప్రభుత్వం దేశవ్యాప్తంగా 10 కోట్ల టాయిలెట్లను నిర్మించిందని మోడీ తెలిపారు.
భారత్ కరోనాను దీటుగా ఎదుర్కొంటుందనీ, వయోజన జనాభాలో 90% పైగా రెండు డోసుల వ్యాక్సిన్ను పొందారని తెలిపారు. 95% పెద్దలు కనీసం ఒక మోతాదు తీసుకున్నారనీ, ఇప్పటికే మన దేశంలో 197 కోట్ల డోసుల టీకాలు వేశామని వెల్లడించారు. అత్యంత(కరోనా) క్లిష్ట పరిస్థితుల్లో ఇతర దేశాలకు భారత్ ధైర్యంగా, అండగా నిలించిందని తెలిపారు.ఈ నేపథ్యలో మోదీ జర్మనీలో జీ7 సదస్సుకు హజరు కానున్నారు. శక్తి, ఉగ్రవాదంపై ఉమ్మడిపోరు, పర్యావరణం, ఆహార భద్రత లపై సమావేశంలో జీ 7 దేశాధినేతలతో చర్చించనున్నట్లు తెలుస్తోంది.