అబద్ధం అలసిపోతుంది.. సత్యానికి అలసట వుండదు, కాంగ్రెస్ను అణగదొక్కలేరు : రాహుల్ గాంధీ
ఈడీ విచారణపై భగ్గుమన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. కాంగ్రెస్ పార్టీ సత్యం కోసం పోరాడుతోందని... సత్యానికీ సహనం వుంటుందని అబద్ధం అలసిపోతుందన్నారు. సత్యం ఎప్పటికీ అలసిపోదని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు
ఈడీ విచారణ (ed inquiry) పేరుతో తనను వేధించాలనుకున్నారని కాంగ్రెస్ (congress) అగ్రనేత రాహుల్ గాంధీ (rahul gandhi) మండిపడ్డారు. కానీ మోడీ (narendra modi) ప్రభుత్వ ఆకాంక్ష నెరవేరలేదని.. కాంగ్రెస్ నేతలన్ని ఎవరూ భయపెట్టలేరని, అణగదొక్కలేరని రాహుల్ స్పష్టం చేశారు. తనను విచారించిన అధికారికి ఈ విషయం అర్ధమైపోయిందని.. కాంగ్రెస్ పార్టీ సత్యం కోసం పోరాడుతోందని ఆయన పేర్కొన్నారు. సత్యానికీ సహనం వుంటుందని.. అబద్ధం అలసిపోతుందని, సత్యం ఎప్పటికీ అలసిపోదని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.
మరోవైపు.. నేషనల్ హెరాల్డ్-మనీలాండరింగ్ కేసుపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేస్తోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వరుసగా విచారణకు పిలుస్తోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్.. బీజేపీ సర్కారుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నదని ఆరోపించింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దుర్వినియోగం, నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసు పై విచారణ సంస్థ ఐదో రోజు ప్రశ్నిస్తున్న పార్టీ అధినేత రాహుల్ గాంధీని వేధింపులకు గురిచేస్తోందని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద మంగళవారం సత్యాగ్రహం దీక్షను చేపట్టింది.
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్తో సహా నిరసన నాయకులు జంతర్ మంతర్కు మార్చ్ను ప్రకటించారు. అయితే అనుమతి లేకపోవడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. పలువురు కాంగ్రెస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. జంతర్ మంతర్ వద్ద నిరసన ప్రదర్శనకు కాంగ్రెస్ నేతలకు అనుమతి ఇచ్చారని, అయితే మార్చ్ చేయడానికి అనుమతించలేదని పోలీసులు తెలిపారు. బఘెల్, మద్దతుదారులతో కలిసి కాంగ్రెస్ కార్యాలయం వెలుపల రోడ్డుపై కూర్చున్నారు. ప్రజలను మోసం చేయడానికి ప్రజాస్వామ్యాన్ని నమ్మేవారిగా ముసుగు వేసుకుంటున్న బీజేపీ నాయకులను ఫాసిస్టులుగా గెహ్లాట్ అభివర్ణించారు.
ALso REad:కాంగ్రెస్ నిరసనల్లో పోలీసులపై ఉమ్మేసిన కాంగ్రెస్ మహిళా నేత (వీడియో)
అయితే రాహుల్ గాంధీని ఈడీ ప్రశ్నించడాన్ని నిరసిస్తూ ఆ పార్టీ దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి ఓ ఆందోళనలో కాంగ్రెస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించిన పోలీసులపై ఓ మహిళా నేత ఉమ్మేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలోకి ఎక్కింది.
దీనిపై బీజేపీ ప్రతినిధి షెహజాద్ పూనావాల మండిపడ్డారు. ఇది సిగ్గు చేటు అని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలు అసోలో పోలీసులపై దాడి చేశారని, హైదరాబాద్లో పోలీసుల కాలర్ పట్టుకున్నారని, ఇప్పుడు ఏకంగా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నెట్టా డిసౌజా పోలీసులపై ఉమ్మేశారు అని అన్నారు. ఇదంతా కేవలం రాహుల్ గాంధీని ఈడీ ప్రశ్నించడం వల్లే అని పేర్కొన్నారు. నెట్టా డిసౌజా పై సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలు చర్యలు తీసుకుంటారా? అని ప్రశ్నించారు.