ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఈడీ మంగళవారం మరో సప్లిమెంటరీ చార్జిషీటు దాఖలు చేసింది. ఈ చార్జిషీటులో ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా పేరును ఈసీ చేర్చింది. మనీష్ సిసోడియా మాజీ సెక్రెటరీ సీ అరవింద్ వెల్లడించిన విషయాల తర్వాత ఎంపీ రాఘవ్ చద్దాను కేసులో చేర్చడం గమనార్హం.
న్యూఢిల్లీ: మనీ లాండరింగ్, ఇతర ఆర్థిక మోసాలపై దర్యాప్తు జరిపే కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మంగళవారం, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో రెండో సప్లిమెంటరీ చార్జిషీట్ను దాఖలు చేసింది. ఈ చార్జిషీట్లో ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా పేరును చేర్చారు. మనీశ్ సిసోడియా మాజీ సెక్రెటరీ సీ అరవింద్ ఈడీకి వెల్లడించిన విషయాల ఆధారంగా రాఘవ్ చద్దాను ఈ కేసులో చేర్చారు. మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా నివాసంలో జరిగిన ఓ సమావేశంలో రాఘవ్ చద్దా కూడా హాజరయ్యారని సీ అరవింద్ దర్యాప్తు సంస్థకు వెల్లడించారు.
ఆ సమావేశంలో పంజాబ్ ఎక్సైజ్ కమిషనర్ వరుణ్ రూజమ్, విజయ్ నాయర్, ఇతర పంజాబ్ ఎక్సైజ్ డైరెక్టరేట్ అధికారులు కూడా పాల్గొన్నారు. విజయ్ నాయర్ ఈ కేసులో నిందితుడు.
ఢిల్లీలో సీబీఐ కోర్టు ముందు దాఖలు చేసిన సీబీఐ సప్లిమెంటరీ చార్జిషీట్లో తొలిసారి మనీశ్ సిసోడియా పేరును పేర్కొన్న కొన్ని రోజుల తర్వాత ఈ పరిణామం ముందుకు వచ్చింది. మనీశ్ సిసోడియాను ఎనిమిది గంటలపాటు విచారించిన తర్వాత దర్యాప్తు సంస్థ ఫిబ్రవరిలో ఆయనను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
ఢిల్లీ ప్రభుత్వం రూపొందించిన 2021-22 ఎక్సైజ్ పాలసీలో పెద్ద మొత్తంలో లంచాలు పుచ్చుకున్న లిక్కర్ వ్యాపారులకే లైసెన్స్లు ఇచ్చినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలను ఆప్ తీవ్రంగా ఖండించింది. ఆ తర్వాత లిక్కర్ పాలసీని రద్దు చేసిన విషయం విధితమే.
ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ మాజీ ఎక్సైజ్ మినిస్టర్, మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాలపై ఈడీ ప్రధానంగా ఆరోపణలు చేస్తున్నది. సప్లిమెంటరీ చార్జిషీటులో కొత్త లిక్కర్ పాలసీ కేజ్రీవాల్ మానస పుత్రిక అని పేర్కొంది. కేజ్రీవల్, సిసోడియాలు విజయ్ నాయర్కు రక్షణ కల్పించారని, తద్వార ఆయన ఈ పాలసీ రూపకల్పన, అక్రమ కార్యకలాపాల్లో పూనుకోవడానికి అవకాశం ఇచ్చారని ఆరోపించింది. ఈ కేసులో అరెస్టయిన తొలి నిందితుడు విజయ్ నాయరే.
ఈ కేసులో నిందితుడిగా ఉన్న సమీర్ మహేంద్రుతో బీఆర్ఎస్ లీడర్ కే కవిత ఆమె నివాసంలో భేటీ అయ్యారని ఈడీ ఆరోపించింది. ఈ సమావేశంలో వ్యాపారులు శరత్ చంద్ర రెడ్డి, అభిషేక్ బోయినపల్లి, కవితకు ఫ్రంట్మెన్గా భావిస్తున్న అరుణ్ పిళ్లై కూడా ఉన్నట్టు పేర్కొంది.