ద్వారకా కోర్టుకు బాంబు బెదిరింపులు... డిల్లీలో కలకలం

Synopsis
నిన్న ప్రముఖ దేవాలయం అయోధ్య రామమందిరాన్ని, నేడు ద్వారకా జిల్లా కోర్టును పేల్చేస్తామంటూ బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో కలకలం రేగింది.
ఇటీవలకాలంలో బాంబు బెదిరింపులు పెరిగిపోయాయి. ఇటీవల అయోధ్య రామమందిరానికి బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. తాజాగా దేశ రాజధాని డిల్లీలోని ద్వారకా జిల్లా కోర్టును పేల్చేస్తామంటూ బెదిరింపు మెయిల్ వచ్చింది. దీంతో బుధవారం ఉదయం కోర్టులో గందరగోళం నెలకొంది... భద్రతా సిబ్బంది వెంటనే కోర్టు ప్రాంగణాన్ని ఖాళీ చేయించి తనిఖీలు చేపట్టారు.
మంగళవారం రాత్రి పంపిన ఈమెయిల్ గురించి కోర్టు అధికారులు పోలీసులకు తెలియజేసారు. ఉదయం 10:45 గంటల ప్రాంతంలో ఈ బాంబు బెదిరింపు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. భద్రతా బృందాలు, డాగ్ స్క్వాడ్లు, బాంబు నిర్వీర్య బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సోదాలు నిర్వహించాయి. అయితే ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభ్యం కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. తనిఖీల అనంతరం కోర్టు కార్యకలాపాలు యధావిధిగా జరిగాయి.
ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలోని రామ మందిర్ ట్రస్ట్కు కూడా బాంబు బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. దీంతో స్థానిక పోలీసులు, భద్రతా సంస్థలు వెంటనే చర్యలు చేపట్టాయి. సోమవారం రాత్రి రామ జన్మభూమి ట్రస్ట్కు బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. రామ మందిర్ నిర్మాణ స్థలంలో బాంబు పేలుడు జరిగే అవకాశం ఉందని ఆ ఈమెయిల్లో హెచ్చరించారు. ‘ఆలయ భద్రతను పెంచాలని’ ఈమెయిల్ పంపిన వ్యక్తి అధికారులను కోరారు. దీంతో ఆలయం, పరిసర ప్రాంతాల భద్రతను పెంచారు.