ట్రైన్ లో ఓ టీటీఈ అసభ్యంగా ప్రవర్తించాడు. మద్యం మత్తులో మహిళా ప్రయాణికురాలి మీద మూత్రవిసర్జన చేశాడు. ఆ మహిళ అమృత్‌సర్‌కు చెందిన తన భర్త రాజేష్ కుమార్‌తో కలిసి ప్రయాణిస్తోంది.

లక్నో : ఇటీవలి కాలంలో రైళ్లలో, విమానాల్లో ప్రయాణికుల మీద తోటి ప్రయాణికులు మూత్రవిసర్జన చేస్తున్న ఘటనలు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. ఎయిరిండియా విమానంలో ఓ వృద్ధురాలిపై మూత్రవిసర్జన చేసిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ తరువాత మార్చి మొదటి వారంలో ఇలాంటి మరో ఘటన వెలుగుచూసింది. గత నెలలో కర్ణాటకలో ఓ ఆర్టీసీ బస్సులో ఇలాంటి సంఘటనే జరిగింది. ఇక ఇప్పుడు రైల్లో ఓ ప్రయాణికురాలి మీద టికెట్ కలెక్టరే మద్యం మత్తులో మూత్రవిసర్జన చేసిన ఘటన వెలుగు చూసింది. 

తాగిన మత్తులో రైల్వే టీటీఈ ఒక మహిళ తలపై మూత్ర విసర్జన చేసినట్లు ప్రభుత్వ రైల్వే పోలీసు (జిఆర్‌పి) అధికారి తెలిపారు. ఈ ఘటన ఆదివారం అకల్ తఖ్త్ ఎక్స్‌ప్రెస్‌లో జరిగింది. అమృత్‌సర్‌కు చెందిన ఆ మహిళ తన భర్త రాజేష్ కుమార్‌తో కలిసి ప్రయాణిస్తోంది.

అమృత్‌సర్‌ నుంచి కోల్‌కతా వెళ్తున్న అకల్‌ తఖ్త్‌ ఎక్స్‌ప్రెస్‌ ఏ1 కోచ్‌లో ఆదివారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగిందని జీఆర్‌పీ అధికారి తెలిపారు. ఈ హఠాత్ పరిణామానికి మహిళ లేచి.. గట్టిగా కేకలు వేయడంలో చుట్టుపక్కల ఉన్న ప్రయాణికులు విని.. మద్యం మత్తులో ఉన్న టీటీఈని పట్టుకున్నారు, అతన్ని బీహార్‌కు చెందిన మున్నా కుమార్‌గా గుర్తించారు. రైలు సోమవారం లక్నోలోని చార్‌బాగ్ రైల్వే స్టేషన్‌కు చేరుకోగానే టీటీఈని జీఆర్‌పీకి అప్పగించారు.

షాకింగ్.. విమానంలో మహిళపై మూత్ర విసర్జన,ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తూ..అసభ్య ప్రవర్తన.. చివరికి..

ఇదిలా ఉండగా, ఫిబ్రవరిలో కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (కెఎస్‌ఆర్‌టిసి) నడుపుతున్న పబ్లిక్ బస్సులో వెలుగు చూసింది. దీనికి సంబంధించిన వివరాల ప్రకారం, 32 ఏళ్ల వ్యక్తి ఘటన జరిగిన రాత్రి హుబ్బళ్లి సమీపంలో నాన్-ఎసి స్లీపర్ బస్సులో మహిళా సహ-ప్రయాణికుల సీటుపై మూత్ర విసర్జన చేశాడు. కేఏ-19 ఎఫ్-3554 నంబర్ గల బస్సు విజయపుర నుంచి మంగళూరు వెళుతోంది. 32 ఏళ్ల ఓ వ్యక్తి.. 20 ఏళ్ల మహిళ కూర్చున్న సీటుపై మూత్ర విసర్జన చేశాడని సహ ప్రయాణికుడు గాలేష్ యాదవ్ తెలిపారు. 

హుబ్బళ్లి సమీపంలోని కిరేసూర్‌లోని 'ధాబా' వద్ద బస్సు డిన్నర్‌ కోసం ఆపినపుడు ఈ ఘటన జరిగింది. "ఆమె కేకలు వేయడంతో సహప్రయాణికులు, బస్సు సిబ్బంది ఆమెకు సహాయం చేయడానికి పరుగెత్తారు. మద్యం మత్తులో ఉన్న యువకుడిని ఆపారు. ఆ సమయంలో అతను సహ ప్రయాణికులతో, బస్సు సిబ్బందితో కూడా దురుసుగా ప్రవర్తించాడు. మద్యం మత్తులో ఉన్న అతడిని అదుపు చేయలేకపోవడంతో, ప్రయాణికులు అతడిని బస్సులోనుంచి బలవంతంగా దింపేయాలని సిబ్బందిని డిమాండ్ చేశారు. 

అయితే, ఈ ఘటన మీద మహిళా ప్రయాణికురాలు ఫిర్యాదు చేయడానికి ఇష్టపడకపోవడంతో, నిందితుడిని దించేసి, బస్సు ముందుకు వెళ్లింది" అని కేఎస్ఆర్ టీసీ అధికారి ఒకరు తెలిపారు. కేఎస్ఆర్ టీసీ, మంగళూరు సీనియర్ డివిజనల్ కంట్రోలర్ రాజేష్ శెట్టి, ప్రయాణికులు, బస్సు సిబ్బంది నుండి సంఘటనకు సంబంధించి తమకు సమాచారం అందిందని తెలిపారు. "మహిళా ప్రయాణికురాలు మాకు లేదా పోలీసులకు ఫిర్యాదు చేయడానికి నిరాకరించడంతో, ఏం చేసేది లేక సిబ్బంది బస్సును ముందుకు పోనిచ్చారు" అన్నారాయన.

బాధితురాలు సీటు నంబర్ 3లో ఉందని, విజయపుర నుంచి హుబ్బల్లికి వెళ్తుండగా, ఆ వ్యక్తి 28-29 సీటులో ఉన్నాడని కొందరు ప్రయాణికులు తెలిపారు. తాను మెకానికల్‌ ఇంజనీర్‌నని, విజయపుర నుంచి మంగళూరుకు వెళ్తున్నానని బాదితురాలి సహ ప్రయాణీకుడు చెప్పాడు. "బస్సు సిబ్బంది వెంటనే ఆమె బ్యాగ్, సీటును శుభ్రపరిచారు. సంఘటన తర్వాత షాక్ లో ఉన్న మహిళా ప్రయాణీకురాలికి భద్రత కల్పించారు" అని మరొక సహ-ప్రయాణికుడు తెలిపాడు.

మంగళూరు సీనియర్ డివిజనల్ కంట్రోలర్ రాజేష్ శెట్టి మాట్లాడుతూ.. బస్సు మార్గమధ్యలో 'ధాబా' దగ్గర ఆగినప్పుడు ఈ సంఘటన జరిగింది. ఆ సమయంలో నిందితుడు తప్ప ఎవరూ బస్సులో లేరని తెలిపారు. "మహిళా ప్రయాణీకురాలు డిన్నర్ ముగించుకుని బస్సులోకి తిరిగి వచ్చినప్పుడు, ఒక యువకుడు తన సీటుపై మూత్ర విసర్జన చేయడాన్ని ఆమె గమనించింది. వెంటనే సిబ్బందికి సమాచారం అందించింది, వారు నేరస్థుడిని బలవంతంగా దింపేశారు" అని శెట్టి తెలిపారు.