కొత్త కార్లు కొనుగోలు చేయొద్దు.. ఎవర్నీ కాళ్లు మొక్కనివ్వొద్దు - ఆర్జేడీ మంత్రులకు తేజస్వీ యాదవ్ సూచన
బీహార్ లో ఆర్జేడీ మంత్రులకు తేజస్వీ యాదవ్ పలు సూచనలు చేశారు. ప్రజలకు గౌరవం ఇస్తూ, సున్నితంగా వ్యవహరించాలని అన్నారు. ఎవరినీ కాలు మొక్కనివ్వొదని తెలిపారు. బొకేలకు బదులు పెన్నులు, పుస్తకాలు ఇచ్చే సంప్రదాయాన్ని ప్రోత్సహించాలని కోరారు.
బీహార్ లో కొత్త మంత్రి వర్గం కొలువు దీరింది. మొత్తం 31 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయగా.. అందులో 16 మంది ఆర్జేడీకి చెందిన వారే ఉన్నారు. అయితే తాజాగా ఆ పార్టీ మంత్రులకు తేజస్వీ యాదవ్ పలు సూచనలు చేశారు. కొత్త మంత్రులు ఎవరూ కొత్త కార్లు, ఇతర వాహనాలు కొనుగోలు చేయవద్దని అన్నారు. కార్యకర్తలు, శ్రేయోభిలాషులు, మద్దతుదారులు లేదా పెద్దవారు ఎవరైనా తమ పాదాలను తాకడానికి అనుమతి ఇవ్వకూడదని అన్నారు. నమస్కారం, నమస్తే, అదాబ్ సంప్రదాయాన్ని ప్రోత్సహించాలని అన్నారు. ఈ మేరకు ఆయన ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్... ఐదుగురికి సీబీఐ సమన్లు
పేదలు, నిరుపేదలతో మంత్రులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని అన్నారు. వారి కులం లేదా మతం వంటి విషయాలకు ప్రాధాన్యత ఇవ్వకూడదని తెలిపారు. ప్రతీ ఒక్కరి పట్ల సున్నితంగా, మర్యాదగా ఉండాలని, వారితో సానుకూలంగా ప్రవర్తించాలని వారిని కోరారు. పువ్వులు, బొకేలను బహుమతులుగా ఇవ్వడానికి బదులుగా పుస్తకాలు, పెన్నుల మార్పిడిని ప్రోత్సహించాలని మంత్రులను కోరారు.
ముఖ్యమంత్రి నాయకత్వంలో అన్ని శాఖాపరమైన పనుల్లో నిజాయితీ, పారదర్శకతను పెంపొందించాలని తేజస్వీ యాదవ్ కోరారు. మంత్రులు తమ పని ప్రణాళికలు, అభివృద్ధి పనులను సోషల్ మీడియాలో పంచుకోవాలని కోరారు. దీని వల్ల మంత్రులు తీసుకునే చొరవ ప్రజలకు సానుకూల సమాచారాన్ని పంపిస్తుందని అన్నారు.
కాంగ్రెస్ అధ్యక్ష పోస్టుకు రాహుల్ గాంధీ ‘నో’.. ప్రియాంక గాంధీకి బాధ్యతలు?
కొత్త బీహార్ ప్రభుత్వంపై బీజేపీ తీవ్ర విమర్శలు చేస్తున్న నేపథ్యంలో మహాఘట్ బంధన్ ప్రతిష్టను పెంచుకునేందుకు తేజస్వీ యాదవ్ ఈ పోస్ట్ చేశారు. ఈ నెల మొదట్లో నితీష్ కుమార్ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏతో సంబంధాలు తెంచుకున్నారు. ఆర్జేడీ, ఇతర పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కొత్త ప్రభుత్వంలో కూడా జేడీ(యూ) అధినేత నితీష్ కుమార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. కాగా.. ఈ పరిణామాల పట్ల బీజేపీ తీవ్రంగా మండిపడింది. జేడీ(యూ) నాయకుడు ఆర్జేడీతో చేతులు కలపడం వల్ల బీహార్ ను అరాచకం, అవినీతి యుగంలోకి నెట్టారని ఆ పార్టీ ఆరోపించింది.