బతుకుదెరువు పోయింది, చనిపోయేందుకు అనుమతివ్వండి
భక్తుల నుంచి మాకు దక్షిణలు రావట్లేదు, బతకడం కష్టంగా మారింది చనిపోయేందుకు అనుమతివ్వండి అంటూ ఓ ఆలయ పూజారి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. భక్తుల నుంచి వచ్చే కానుకలే తమకు ఏకైక ఆదాయమని దాన్ని హరించడంతో బతుకుదెరువు కష్టమవుతోందని తన పిటీషన్ లో పేర్కొన్నాడు.
భువనేశ్వర్: భక్తుల నుంచి మాకు దక్షిణలు రావట్లేదు, బతకడం కష్టంగా మారింది చనిపోయేందుకు అనుమతివ్వండి అంటూ ఓ ఆలయ పూజారి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. భక్తుల నుంచి వచ్చే కానుకలే తమకు ఏకైక ఆదాయమని దాన్ని హరించడంతో బతుకుదెరువు కష్టమవుతోందని తన పిటీషన్ లో పేర్కొన్నాడు.
వివరాల్లోకి వెళ్తే ఒడిశా రాష్ట్రం పూరీలోని ప్రముఖ దేవాలయం పూరీ జగన్నాథస్వామి ఆలయం. ఈ ఆలయంలో పూజారులుగా నరసింఘ పూజపండ,అతని కుటుంబ సభ్యులు పనిచేస్తున్నారు. భక్తుల నుంచి వచ్చే కానుకలు, దక్షిణలు తీసుకుని వీరు జీవిస్తుంటారు. అవే వారిజీవన ఆదాయానికి ఏకైక మార్గం. వేలాది సంవత్సరాల నుంచి ఇది సాంప్రదాయంగా వస్తుంది.
అయితే ఆలయంలో కానుకలు, పారదర్శకతపై కటక్ కు చెందిన ఓ న్యాయవాది సుప్రీంకోర్టులో పిటీషన్ వేశారు. ఈ సందర్భంగా అత్యున్నత ధర్మాసనం కీలక తీర్పునిచ్చింది. జగన్నాథ స్వామి ఆలయంలో పారదర్శకత కోసం సంస్కరణలు చేపట్టేందుకు కోర్టు గత జూలైలో 12 ప్రతిపాదనలు చేసింది.
12 ప్రతిపాదనలలో భక్తుల నుంచి ఆలయ పూజారులు దక్షిణ తీసుకోవద్దన్నది ఒకటి. భక్తుల నుంచి ఏమైనా కానుకలు వస్తే అవి హుండీకే చెందాలని స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాలతో భక్తులు పూజారులకు దక్షిణ ఇచ్చే వీలు లేకుండా జగన్నాథ స్వామి ఆలయంలో ఏర్పాట్లు చేశారు.
తమ పూర్వీకుల నుంచి వారసత్వంగా ఆలయంలో పూజలు నిర్వహిస్తున్నామని భక్తుల నుంచి కానుకలు స్వీకరించడం ఆనవాయితీ అని పూజారి స్పష్టం చేశాడు. దక్షిణలు హుండీలోనే వెయ్యాలన్న సుప్రీంకోర్టు తీర్పు, అందుకు ప్రభుత్వం కఠినతర నిబంధనలతో తమకున్న ఏకైక మార్గాన్ని హరించాలని చూస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
భక్తుల నుంచి ఎలాంటి దక్షిణలు స్వీకరించకపోతే తాము ఎలా బతకాలంటూ ఆవేదన వ్యక్తం చేసింది. సరైన ఆదాయ మార్గం లేకుండా తాము ఎలా జీవించాలని ప్రశ్నించారు. తమకు జీవనోపాధి కల్పించాలని ఒడిశా ప్రభుత్వాన్ని కలిశామని అయితే ఇంతవరకు స్పందించలేదని పూజారి నరసింఘ పూజపండ వాపోయారు. ఆకలితో అలమటించి చచ్చే బదులు ఒకేసారి మరణించేందుకు అవకాశమివ్వండి అని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు.