‘‘ మీ వాళ్లు మాతో టచ్లో వున్నారు’’.. డీఎంకే, అన్నాడీఎంకే పార్టీల మైండ్ గేమ్, ఉత్కంఠగా తమిళ రాజకీయాలు
డీఎంకే, అన్నాడీఎంకేల మైండ్ గేమ్తో తమిళనాడులో రాజకీయాలు ఉత్కంఠగా మారాయి. ఇరు పార్టీలు.. మీ వాళ్లు మాతో టచ్లో వున్నారంటూ బహిరంగంగానే ప్రకటనలు విడుదల చేస్తూ వుండటంతో రాజకీయాలు కాకపుట్టిస్తున్నాయి.
జయలలిత, కరుణానిధిల మరణం తర్వాత తమిళనాట రాజకీయ శూన్యత ఏర్పడిన సంగతి తెలిసిందే. స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే బలంగా కనిపిస్తుండగా.. అన్నాడీఎంకే మాత్రం ఆధిపత్య పోరుతో సతమతమవుతోంది. ఈ నేపథ్యంలో వచ్చే సార్వత్రిక ఎన్నికలు ఇరుపార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఈ నేపథ్యంలో రెండు పార్టీలు వలసలపై దృష్టి సారించాయి. ఈ క్రమంలోనే పది మంది డీఎంకే ఎమ్మెల్యేలు తమతో సంప్రదింపులు చేస్తున్నారని.. అన్నాడీఎంకే తాత్కాలిక జనరల్ సెక్రటరీ , మాజీ సీఎం పళనిస్వామి బాంబు పేల్చారు. దీనికి డీఎంకే ఎంపీ ఆర్ఎస్ భారతీ సైతం ధీటుగా బదులిచ్చారు. పలువురు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు తమతో టచ్లో వున్నారని కౌంటరిచ్చారు. మొత్తం 50 మంది ఎమ్మెల్యేలు, 30 మంది జిల్లా సెక్రటరీలు, ఇద్దరు ఎంపీలు తమతో సంప్రదింపులు జరుపుతున్నారని.. డీఎంకే నుంచి టచ్లో వున్న వారి వివరాలను పళనిస్వామి చెబితే తాము కూడా లిస్ట్ వెల్లడిస్తామని ఆర్ఎస్ భారతీ స్పష్టం చేశారు. అంతేకాదు.. అసలైన ద్రవిడ ఉద్యమ పార్టీ డీఎంకేనని, ఏఐఏడీఎంకేకు చెందిన నేతలు తమ పార్టీలో చేరాలని భారతీ పిలుపునిచ్చారు.
కాగా.. అన్నాడీఎంకేతో 10 మంది డీఎంకే ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని, వారు తమ మద్దతును మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారని పళనిస్వామి బుధవారం నాడు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అన్నాడీఎంకే నేత ఓ పన్నీర్సెల్వం కుమారుడు కూడా అయిన ఏఐఏడీఎంకే ఎంపీ రవీంద్రనాథ్ 'పుతుమై పెన్' పథకానికి మద్దతు ఇవ్వడం ద్వారా డీఎంకేతో సన్నిహిత బంధాన్ని పంచుకుంటున్నారని మాజీ తమిళనాడు సీఎం ఆరోపించారు. వార్తా సంస్థ ఏఎన్ఐ నివేదించిన ప్రకారం.. “తమిళనాడులో అనేక రాజకీయ పార్టీలు ఉన్నప్పటికీ, ప్రతి ఒక్కరూ అన్నాడీఎంకే పట్ల అభిమానంతో ఉన్నారు. 10 మంది డీఎంకే ఎమ్మెల్యేలు తమ వైపు మారేందుకు మాతో టచ్లో ఉన్నారు అని ఎడప్పాడి కె పళనిస్వామి చెప్పినట్టు పేర్కొంది.
ALso REad:10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నారు: పళనిస్వామి సంచలన వ్యాఖ్యలు
'పుతుమై పెన్ స్కీమ్'కు మద్దతు ఇచ్చిన తర్వాత ఓపీ రవీంద్రంత్ డీఎంకేతో సన్నిహిత సంబంధాన్ని పంచుకున్నారని కూడా ఆయన ఆరోపించారు. ప్రభుత్వ పాఠశాలల్లోని బాలికలకు ఉన్నత విద్యను అభ్యసించేందుకు రూ.1,000 అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన 'పుతుమై పెన్' పథకాన్ని రవీంద్రనాథ్ మంగళవారం మరోసారి ప్రశంసించారు. డ్రగ్స్ మహమ్మారిపై ఎడప్పాడి పళనిస్వామి మాట్లాడుతూ.. డ్రగ్స్ వాడకాన్ని నియంత్రించడంలో తమిళనాడు ప్రభుత్వం విఫలమైందని, డీఎంకే కూడా ప్రజలకు ఉపయోగపడే ఏ పథకాన్ని నెరవేర్చలేదని, అన్నాడీఎంకే అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఆపేందుకు ప్రయత్నిస్తోందని, నేరాలు రాష్ట్రంలో పెరుగుతున్నాయని అ్నారు. అలాగే, ఆన్లైన్ జూదం గురించి మాట్లాడుతూ "ఏఐఏడీఎంకే ఆన్లైన్ రమ్మీని నిషేధించాలని నిరంతరం పట్టుబడుతోంది. అయితే, ఆన్లైన్ జూదం నిషేధానికి సంబంధించి వివిధ పార్టీల నుండి అభిప్రాయాలను సేకరించేందుకు తమిళనాదు సీఎం ఎంకే స్టాలిన్ మాత్రం సమావేశం నిర్వహించడం లేదు అని" ఆరోపించారు.