నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా, మరి మీరు: మోదీకి స్టాలిన్ సవాల్
కేసీఆర్ కలయికతో బీజేపీ యేతర కూటమిలో తమకు ఎక్కడ మైలేజ్ తగ్గుతుందోనని ఉక్కిరిబిక్కిరి అవుతున్న డీఎంకే చీఫ్ స్టాలిన్ కు బీజేపీ వ్యాఖ్యలు కలవరపాటుకు గురి చేస్తున్నాయి. తమిళనాడులో పొత్తు కోసం డీఎంకే తమతో సంప్రదింపులు జరుపుతున్నట్టు బీజేపీ పేర్కొనడం ఇప్పుడు తమిళనాడు వ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి
చెన్నై: తెలంగాణ సీఎం కేసీఆర్ తనను కలిసిన అంశంపై వివరణ ఇచ్చుకునే పనిలో పడ్డ స్టాలిన్ కు బీజేపీ ఇరకాటంలో పడేసింది. కేసీఆర్ కలయికతో బీజేపీ యేతర కూటమిలో తమకు ఎక్కడ మైలేజ్ తగ్గుతుందోనని ఉక్కిరిబిక్కిరి అవుతున్న డీఎంకే చీఫ్ స్టాలిన్ కు బీజేపీ వ్యాఖ్యలు కలవరపాటుకు గురి చేస్తున్నాయి.
తమిళనాడులో పొత్తు కోసం డీఎంకే తమతో సంప్రదింపులు జరుపుతున్నట్టు బీజేపీ పేర్కొనడం ఇప్పుడు తమిళనాడు వ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. బీజేపీ ఆరోపణలపై డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ ఘాటుగా స్పందించారు.
తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్ చేసిన ఆరోపణలు రుజువు చేయగలిగితే రాజకీయాల నుంచి తాను శాశ్వతంగా తప్పుకుంటానని స్టాలిన్ సవాల్ విసిరారు. తమిళసై సౌందర్ రాజన్ చేసిన ఆరోపణలు తప్పని రుజువైతే ఆమెతోపాటు ప్రధాని నరేంద్రమోదీ కూడా రాజకీయాల నుంచి తప్పుకునేందుకు సిద్ధమా అంటూ ప్రశ్నించారు.
బీజేపీతో కలిసేందుకు తాము ఏనాడు ప్రయత్నించలేదని ఆయన వివరణ ఇచ్చారు. తాము బీజేపీ యేతర కూటమిలో ఉన్నట్లు స్టాలిన్ ప్రకటించారు. ఇకపోతే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళసై సౌందర్ రాజన్ మీడియాతో మాట్లాడుతూ, పొత్తు కోసం బీజేపీతో డీఎంకే సంప్రదింపులు జరుపుతోందని వ్యాఖ్యానించారు.
అవును. ఇది నిజం అంటూ చెప్పుకొచ్చారు. డీఎంకే కొందరి ద్వారా బీజేపీతో సంబంధాల కోసం సంప్రదింపులు సాగిస్తోందని స్పష్టం చేశారు. బీజేపీ విజయతీరాలను చేరబోతోందని స్పష్టం చేశారు. బీజేపీ విజయం తథ్యమంటూ పోల్ అంచనాలు వస్తున్నాయంటూ ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు.