బెంగళూరు, మైసూరు హైవే అండర్ బ్రిడ్జీ వద్ద వరద నీరు నిలిచింది. భారీ మొత్తంలో వరద నీరు రావడంతో వాహనాలకు ఇబ్బందులు తలెత్తాయి. పలు వాహనాలు నియంత్రణ కోల్పోయి ఢీకొట్టుకున్నాయి. వారం క్రితమే ప్రధాని ప్రారంభించిన ఈ రోడ్డుపై వరద ఆ స్థాయిలో నిలవడంపై ప్రయాణికులు ఆగ్రహిస్తున్నారు.  

బెంగళూరు:కర్ణాటకలో బెంగళూరు-మైసూరు హైవేను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆరు రోజుల క్రితం ప్రారంభించారు. శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి ఈ హైవేపై ఉన్న అండర్‌బ్రిడ్జీ ప్రాంతంలో వరద నీరు నిలిచింది. దీంతో ఇక్కడ వాహనాలు ప్రయాణించడం కష్టతరంగా తోచింది. కొన్ని కార్లు అయితే ఆ వరద నీటిలోకి వెళ్లిన తర్వాత ఆఫ్ అయిపోయాయి. చాలా వాహనాలు బంపర్ టు బంపర్ ఢీకొట్టుకున్నాయి. దీంతో ఆ రహదారిపై వెళ్లుతున్న ప్రయాణికులు రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వస్తున్నారంటే.. పది నిమిషాల్లో ఇక్కడ వరద నీరే కనిపించదూ అని ఆక్రోశించారు. అదే సామాన్య పౌరుల బాధలు వీరికి పట్టవా? అని ప్రశ్నించారు. అసలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కనీసం రహదారి గురించి అడిగి తెలుసుకోలేదా? ప్రారంభించడానికి ఈ హైవే సిద్ధంగా ఉన్నదా? లేదా? అని కూడా అడగలేదా? అని ఆగ్రహిస్తున్నారు.

బెంగళూరుకు పొరుగునే ఉండే రామానగర రీజియన్‌లో హైవేపై అండర్ బ్రిడ్జీ నిర్మించారు. ఈ ప్రాంతంలోకి వచ్చిన వరద నీరు బయటకు వెళ్లే దారి లేదు. దీంతో వచ్చిన వరద నీరు అలాగే నిలిచి ఉన్నది. అండర్ బ్రిడ్జీ కింద పెద్దమొత్తంలో వరద నీరు నిండిపోయి ఉన్నది. ఈ హైవేను రూ. 8,480 కోట్లతో నిర్మించారు. 

ఏడాది క్రితం వరద నీటితో నిండిపోయిన అండర్ బ్రిడ్జే ఇది. 

కొందరు ప్రయాణికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమ వాహనాల డ్యామేజీ కావడంతో సీఎం బసవరాజ్ బొమ్మై, పీఎం మోడీలపై ఆగ్రహించారు. 

‘నా మారుతి స్విఫ్ట్ కారు అండర్ బ్రిడ్జీ వద్దగల వరద నీటిలో సగం మునిగిపోయింది. మధ్యలో కారు స్విచ్ ఆఫ్ అయిపోయింది. వెనుక నుంచి వచ్చిన లారీ నా కారును ఢీకొంది. దీనికి ఎవరు బాధ్యత వహించాలి? నా కారు రిపేర్ చేయించాలని సీఎం బొమ్మైని రిక్వెస్ట్ చేస్తున్నా. ఈ రోడ్డును ప్రారంభించిన ప్రధాని మోడీ అయినా.. అసలు ఇది ప్రారంభించడానికి సిద్ధమైందా లేదా? అని రోడ్డు,రవాణా శాఖ మంత్రిని అయినా అడిగి తెలుసుకోలేదా? ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మేం బాధపడాలా? టోల్ ఫీ ఎక్కువ తీసుకుని నిర్మించారు, కానీ, ఏ లాభం?’ అని ఆవేదనతో వికాస్ అనే ప్రయాణికుడు మాట్లాడారు.

Also Read: షార్క్ బారి నుంచి తృటిలో తప్పించుకున్న మహిళ... భయానక వీడియో..!

మరో ప్రయాణికుడు నాగరాజు మాట్లాడుతూ ‘అండర్ బ్రిడ్జ్ వద్ద వరద నీరు చేరుతుండగా అనేక యాక్సిడెంట్లు రిపోర్ట్ అయ్యాయి. మొదటి యాక్సిడెంట్ నాకే జరిగింది. కనీసం ఏడు నుంచి ఎనిమిది కార్లు బంపర్ టు బంపర్ ఢీకొట్టుకున్నాయి. నీరు వెళ్లిపోవడానికి స్పేసే లేదు. అదే ప్రధాని పర్యటన ఉంటేనా.. పది నిమిషాల్లో నీటిని క్లియర్ చేసేవారు. సామాన్య మానవుడి బాధలు మీకు కనిపించడం లేదా? వీటికి ఎవరు బాధ్యత వహించాలి? అని ప్రశ్నించారు.

బెంగళూరు, మైసూర్ ఎక్స్‌ప్రెస్ వేను ప్రధాని మోడీ మార్చి 12వ తేదీన ప్రారంభించారు. ఇది మూడు గంటల ప్రయాణాన్ని 75 నిమిషాలకు కుదిస్తున్నదని తెలిపారు. 118 కిలోమీటర్ల సిక్స్ లేన్ రోడ్డు ఆ రీజియన్‌ అభివృద్ధిలో కీలకంగా మారుతుందని భావిస్తున్నారు.