Reunion: 1962-65 మధ్య చదువుకున్న క్లాస్‌మేట్స్ 60 ఏళ్ల తర్వాత మళ్లీ కలుసుకున్నారు. 85-86 ఏళ్ల వయసులో జరిగిన ఈ అరుదైన రీయూనియన్‌లో, ఒకప్పటి 122 మందిలో ఇప్పుడు మిగిలిన 12 మంది పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ మూడు రోజులు గడిపారు.

Dharwad College Friends Reunite After 60 Years: కాలం ఎవరి కోసమూ ఆగదు, కానీ కొన్ని జ్ఞాపకాలు మాత్రం కాలంతో పాటు చెరిగిపోవు. సరిగ్గా 60 ఏళ్ల క్రితం ఒకే తరగతి గదిలో కూర్చుని పాఠాలు విన్న ఆ స్నేహితులు, ఇప్పుడు తమ 85-86 ఏళ్ల ఇలవయస్సులో మళ్లీ ఒకచోట చేరారు. ధార్వాడ్‌లోని అగ్రికల్చర్ కాలేజ్ లో ఈ రీయూనియన్ జరిగింది. 1962-65 బ్యాచ్‌కు చెందిన బిఎస్సీ అగ్రి విద్యార్థులు మూడు రోజుల పాటు సాగిన ఈ అపురూప వేడుకలో పాల్గొని తమ పాత రోజులను నెమరువేసుకున్నారు.

1965లో డిగ్రీ పూర్తి చేసుకుని బయటకు వచ్చేటప్పుడు ఆ బ్యాచ్‌లో మొత్తం 122 మంది విద్యార్థులు ఉండేవారు. ఆరు దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణంలో చాలా మంది మిత్రులు లోకాన్ని విడిచి వెళ్లారు. ప్రస్తుతం ఆ బ్యాచ్‌లో కేవలం 12 మంది మాత్రమే జీవించి ఉన్నారు. ఈ 12 మంది మిత్రులు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఈ వేడుకకు హాజరుకావడం విశేషం. వృద్ధాప్యం పైబడినప్పటికీ, స్నేహితులను చూడాలనే ఉత్సాహం వారిలో యువకుల తరహాలోనే కనిపించింది.

కన్నీటి జ్ఞాపకాలు.. ఆత్మీయ సన్మానాలు

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎ.ఎస్. ప్రభాకర్, పి.ఎ. సారంగమఠ్, రవీంద్ర బసవనాళ, శివరాజ్, జి. పరమేశ్వర్, ఎస్.పి. హుల్లత్తి, జి.ఆర్. గుండి, వి.ఎస్. ముత్తల్లి, సి.బి. పట్టణశెట్టి, కుమారస్వామి, విజయకుమార్ గిడ్నవర్ తమ జీవిత ప్రయాణంలోని గెలుపోటములను పంచుకున్నారు. నాటి ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.డబ్ల్యూ. మెణసినకాయి, ఇతర అధ్యాపకులు తమకు అందించిన ప్రోత్సాహాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేసుకున్నారు. మరణించిన తమ తోటి స్నేహితుల జ్ఞాపకార్థం వారంతా మౌనం పాటించి నివాళులర్పించారు.

ఈ అపురూప సమ్మేళనాన్ని ఎంతో చక్కగా నిర్వహించిన సహపాఠి ఎస్.వి. ముత్తల్లి దంపతులను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు. 60 ఏళ్ల క్రితం విడిపోయిన స్నేహితులు, తమ మునిమనవళ్లతో కలిసి మళ్లీ అదే క్యాంపస్‌లో నవ్వుతూ, జోకులు వేసుకుంటూ గడపడం అక్కడ ఉన్న వారందరినీ కదిలించింది. స్నేహానికి వయస్సుతో సంబంధం లేదని ఈ మిత్రులు మరోసారి నిరూపించారు.